Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

సమాజం బండబారిందా!?

మోదీ సర్కారు 2002 గుజరాత్‌ మారణకాండ సమయంలో బిల్కిస్‌ బానో, ఆమె తల్లి మీద అత్యాచారం చేసిన 11మందిని శిక్ష పూర్తి కాకుండానే విడుదల చేసింది. గత ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట బురుజుల మీంచి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల ఆత్మగౌరవం, వారి హక్కుల పరిరక్షణ, నారీ శక్తి గొప్పదనాన్ని గురించి గంభీరంగా ప్రసంగించిన కొద్ది సేపటికే బిల్కిస్‌ బానో మీద అత్యాచారంచేసి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని విడుదల చేసి చట్టాన్ని, న్యాయాన్ని అపహాస్యం పాలు చేశారు. ఇది చాలదన్నట్టు హర్యానాలోని ఆదంపూర్‌ లో నవంబర్‌ 9న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో డేరా సచ్చా అధిపతి బాబా గుర్మీత్‌ రాం రహీంసింగ్‌ను అక్టోబర్‌ 14న 40 రోజుల పెరోల్‌ మీద విడుదల చేసింది మోదీ ప్రభుత్వం. ఆయన బీజేపీకి సన్నిహితంగా ఉండే బాబా. ఆయన తన శిశ్యురాండ్రిద్దరి మీద అత్యాచారం చేసినందుకు పదేళ్లు, తన అనుయాయి రంజీత్‌ సింగ్‌ను హత్య చేసినందుకు మరో పదేళ్లు జైలు శిక్ష విధించారు. పదేళ్ల పాటు విధించిన ఈ రెండు శిక్షలను ఆయన విడివిడిగా అంటే మొత్తం 20 ఏళ్లు జైలులోనే ఉండాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఆయన పలుకుబడిని వినియోగించుకుని విజయం సాధించడానికి విడుదల చేశారని స్పష్టం అవుతూనే ఉంది. ఆయన విడుదలైన తరవాత బీజేపీ శాసన సభ్యుడు రణ్వీర్‌ గంగ్వా, కర్నాల్‌ మేయర్‌ రేణుగుప్తా, డిప్యూటీ మేయర్‌ రాజేశ్‌ బాబాను దర్శించుకున్నారు. విడుదలైన తరవాత బాబా రాం రహీం సత్సంగం నిర్వహిస్తే వీరు దానికి హాజరై చేతులు జోడిరచి తమ ప్రాంతాలకు రావాలని అభ్యర్థించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర రాణా కూడా గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ను దర్శించుకుని ధన్యులయ్యారు. ఆదంపూర్‌ శాసనసభ ఎన్నికతో పాటు పంచాయతీ ఎన్నికలూ ఉన్నాయి కనక గుర్మీత్‌ సింగ్‌ను విడుదల చేశారు. ఆయన ఇద్దరు మహిళల మీద అత్యాచారం చేసినా అనేక మంది మహిళలూ బాబా సత్సంగ్‌కు హాజరై ధన్యులమయ్యామనుకున్నారు. ఈ లెక్కన 2024 సార్వత్రిక ఎన్నికలలో గెలవడానికి జైలులో ఉన్న హంతకులనూ, అత్యాచారానికి పాల్పడిన వారికీ పెరోల్‌ మంజూరు చేస్తారేమో! అత్యాచారం చేసినందుకు పండు ముసలి అశారాం బాపూ మాత్రం విడుదల కాకుండా ఏం పాపం చేశారో! అత్యాచారాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష వేయాలని గట్టిగా కోరే మహిళలు ఇప్పుడు మౌనంగా ఎందుకున్నట్టు? నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు దేశవ్యాప్తంగా గగ్గోలు జరిగింది. దిల్లీ మహిళల నిరసనతో భగ్గుమంది. గుజరాత్‌కు చెందిన 11 మంది రేపిస్టులు విడుదలైన తరవాత బీజేపీ నాయకులు ఆ కర్కోటకులను సత్కరించారు. పుష్ప మాలాంకృతులను చేశారు. మిఠాయిలు పంచారు. హత్రాస్‌ సంఘటనలో దోషులను సైతం బీజేపీ ఇలాగే సత్కరించిన దుర్నీతిని జనం ఇంకా మరిచిపోకముందే బిల్కిస్‌ కేసులో దోషులను సత్కరించడం మన సమాజం ఎంత మొద్దుబారి పోయిందో చూసి విస్తు పోవాల్సిందే. హత్రాస్‌ సంఘటనలో బాధితురాలు దళిత యువతి కనక ఆమె మీద అత్యాచారం చేసిన వారు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని సిగ్గు విడిచి అర్థం చేసుకోవడం సాధ్యమే. కానీ డేరా సచ్చా బాబా విషయంలో బాధిత అమ్మాయిలిద్దరూ హిందువులే. అలాంటప్పుడు బీజేపీ నాయకులు బాబాకు మోకరిల్లడంలో ఆంతర్యం ఏమిటి అని అనుమానం వ్యక్తంచేసినా ఫలితం ఏమీ లేదు. సమాజం బండబారినప్పుడు ఇలాంటి సంఘటనలు ఆశ్చర్యం కలిగించకపోవడం సహజమే. డేరా సచ్చా బాబా ఆగడాలను బయటపెట్టిన పత్రికా రచయిత ఛత్రపతిని హతమార్చారు. రాజకీయ నాయకులే సాగిలపడి అత్యాచారానికి, హత్యలకు పాల్పడే బాబాలకు దాసోహం అంటున్న తరుణంలో ఏదీ ఆశ్చర్యకరం కాదు.
నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు గగ్గోలు పెట్టిన సమాజం బిల్కిస్‌ బానో మీద అత్యాచారం చేసిన వారిని విడుదల చేస్తే మౌనంగా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అంతుబట్టదు. బిల్కిస్‌ కేసులో నిందుతుల్లో దాదాపు అందరూ అనేక సార్లు పెరోల్‌ మీద విడుదలైన వారే. రమేశ్‌ భాయ్‌ చందానా 1198 రోజుల పాటు, రాజుభాయ్‌ బలర్తా సోని 1168 రోజుల పాటు, ప్రదీప్‌ రమణ్‌ లాల్‌ 1011 రోజుల పాటు పెరోల్‌ మీద బయటే ఉన్నారు. వీరిలో చాలా మంది పెరోల్‌ గడువుదాటిన తరవాత కూడా మళ్లీ జైలుకెళ్లడంలో జాప్యం చేశారు. పెరోల్‌ నియమాలను ఉల్లంఘించినా వారికి పదే పదే పెరోల్‌ మంజూరు చేయడం ఏలిన వారి కరుణా కటాక్షాలకు మించిన కారణం ఏమైనా ఉంటుదంటే నమ్మలేం. జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని శిక్షా కాలం పూర్తి కాకుండానే విడుదల చేసే అవకాశం, అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. బిల్కిస్‌ కేసులో గుజరాత్‌ ప్రభుత్వం ఆ అధికారాన్ని వినియోగించుకుని విడుదల చేయడం చట్టాన్ని ఉల్లంఘించడం కాకపోవచ్చు. కానీ వారి విడుదలకు అనుమతి మంజూరుచేసిన కమిటీలో మొత్తం బీజేపీ వారే నిండిపోయారు. ఈ పదకొండుమంది విడుదలకు అమిత్‌ షా నాయకత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతించిందన్న వాస్తవం ఆలస్యంగా బయట పడిరది. అయితే సీపీఐఎంకు చెందిన సుభాషిణీ అలీ, పత్రికారచయిత్రి రేవతి, తత్వ శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేసిన రూప్‌రేఖావర్మ, తృణమూల్‌ పార్లమెంటు సభ్యురాలు మహువా మొయిత్ర, మాజీ ఐ.ఎఫ్‌.ఎస్‌. అధికారు మదు బాధురీ, సామాజిక కార్యకర్త జగ్దీప్‌ చోకర్‌ వీరిని విడుదల చేయాడాన్ని సవాలు చేస్తూ పెట్టుకున్న పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించడం కచ్చితంగా కారు చీకటిలో కాంతి రేఖే. బిల్కీస్‌ బానో మీద అత్యాచారంతో పాటు గుజరాత్‌ మారణకాండ చాటున ఆమె మూడేళ్ల కూతురితో పాటు ఆమెకు సన్నిహితులైన 14మందిని హత్య చేశారు. అలాంటి కిరాతకులను విడుదలచేసిన ఉదంతాన్నివిచారించడానికి అంగీకరించినందుకు అత్యున్నత న్యాయ స్థానాన్ని అభినందించాలి. ఈ నిర్ణయం న్యాయం ఇంకాపూర్తిగా అంత మొందలేదనడానికి తార్కాణం. న్యాయమూర్తులు అజయ్‌ రస్తోగి, సి.టి.రవికుమార్‌ విడుదలను సవాలుచేసే పిటిషన్‌ను విచారించడం ఆహ్వానించదగిన పరిణామం. అరుణ్‌రాయ్‌ నాయకత్వంలోని సీపీఐ అనుబంధ జాతీయ మహిళాసమాఖ్య అంతకు ముందే దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి తాజా పిటిషన్‌ను విచారణ చేయాలని నిర్ణయించింది. 11 మందిని ఎందుకు విడుదలచేశారో తెలియజేస్తూ ప్రమాణపత్రం అంద జేయాలని సుప్రీంకోర్టు కోరితే గుజరాత్‌ప్రభుత్వం అక్టోబర్‌ 18న వెయ్యి పేజీలకు మించిన అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇది విచారణను సంక్లిష్టం చేసేందుకు పన్నిన పన్నాగమే. ఈ 11మంది జైలులో సత్ప్రవర్తనతో మెలగినందుకు విడుదలచేశారట. విడుదలైన తరవాత బీజేపీ వారిని సత్కరించడమేకాక వారు సద్బ్రాహ్మణులని కితాబు కూడా ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img