ఉత్తరప్రదేశ్లో రాజకీయ నాయకుడి అవతారమెత్తిన కరడుగట్టిన మాఫియా నాయకుడు అతీఖ్ అహమద్, ఆయన సోదరుడు అష్రాఫ్ను పోలీసు నిర్బంధంలో ఉండగానే ఇతరు లెవరో కాల్చి చంపడంపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే సోమవారం విచారణ జరగవచ్చు. న్యాయవాది విశాల్ తివారీ అతీఖ్ అహమద్, ఆయన సోదరుడి హత్యతో పాటు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ హయాంలో 2017 నుంచి జరిగిన 183 ఎన్ కౌంటర్ల మీద కూడా త్వరితంగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకున్నారు. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్ర చూడ్ అంగీకరించారు. చట్టబద్ధ పాలనను పరిరక్షించడానికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు, నిర్దేశాలు జారీ చేయాలని కూడా న్యాయవాది తివారీ తన పిటిషన్ లో కోరారు. తమ కళ్లెదుటే ముగ్గురు వ్యక్తులు అతీఖ్ అహమద్ ను ఆయన సోదరుడు అష్రాఫ్ ను కాల్చి చంపడం దేశమంతటినీ కలవరపరచింది. అంతకన్నా ఘోరమైన అంశం ఏమిటంటె ఈ కాల్పులు జరుపుతున్నప్పుడు కానీ ఆ తరవాత కానీ పోలీసులు ఆ ముగ్గురి మీద ఎలాంటి చర్యా తీసుకోకపోవడం పోలీసుల అసమర్థతకు మాత్రమే తార్కాణం కాదు. యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వమే ఎన్ కౌంటర్లను బాహాటంగా ప్రోత్సహిస్తున్నప్పుడు పోలీసులు ఇంతకన్నా భిన్నంగా వ్యవహరిస్తారను కోలేం. తమ పని ముగించిన తరవాత లవలేశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్య ఆయుధాలు కింద పారేసి జై శ్రీరాం అన్న నినాదాలు చేసి తాము లొంగి పోతున్నామని ప్రకటించారు. తామూ గొప్ప మాఫియా నాయకులుగా చెలామణి కావడానికే ఈ హత్యకు పాల్పడ్డామని ప్రస్తుతం జ్యుడీషియల్ నిర్బంధంలో ఉన్న హంతకులు చెప్పారట. ఇదీ జనం దృష్టిని మళ్లించడానికి పోలీసులు అల్లిన కట్టుకథలాగే కనిపిస్తోంది. ఆ ముగ్గురూ దిగువ మధ్య తరగతికి చెందిన వారే. అలాంటప్పుడు వారి దగ్గర అత్యంత ఖరీదైన పిస్తోళ్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు? శక్తిమంతమైన వారెవరో వారికి దన్నుగా నిలవక పోతే ఇంత సాహసానికి వారు ఒడిగట్టి ఉండరు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులెవరూ ఇప్పటిదాకా పెదవి విప్ప లేదంటే ఈ మొత్తం వ్యవహారంలో నిగూఢమైన ఆంతర్యం ఏదో ఉన్నట్టే కనిపిస్తోంది. యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాత్రం వెంటనే ఒక న్యాయ విచారణతో పాటు మొత్తం మూడు రకాల విచారణలకు ఆదేశించింది. విచారణ జరిపే వారిలో నిష్పక్షపాతంగా ఉండేవారు ఒక్కరైనా ఉన్న దాఖలాలు లేవు. పనిలో పనిగా ప్రభుత్వంలో ఉన్న వారికి భద్రత మరింత పెంచారు. ఇదీ దృష్టి మళ్లించే ఉద్దేశంతోనే జరిగినట్టు ఉంది. వీరిద్దరికీ వైద్యం చేయించడం కోసం గత శనివారం రాత్రి దాదాపు పది గంటల సమయంలో పోలీసులు ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ఈ హత్యలు జరిగాయి. ఆసుపత్రి వర్గాల వారు చెప్పిన దాన్నిబట్టి నిర్బంధంలో ఉన్న అన్నదమ్ములిద్దరినీ తీసుకొస్తున్నట్టు ముందుగా తెలియజేయనే లేదట. కేవలం 15 నిమిషాల ముందే ఈ విషయం ఆసుపత్రి వారికి తెలిసింది. అలాగైతే ఆసుపత్రి వారికే ముందుగా సమాచారం ఇవ్వనప్పుడు అక్కడికి పత్రికా విలేకరులు ఎలా వచ్చినట్టు? పత్రికా విలేకరుల బృందంలో దూరిపోయిన ముగ్గురు యువకులకు ఈ సమాచారం ఎవరు అందించి నట్టు? ఈ హత్యలు జరగడానికి కొద్దిగా ముందే అతీఖ్ అహమద్ కుమారుడు అసద్ అంత్యక్రియలు జరిగాయి. కొడుకు అంత్యక్రియలకు అతీఖ్ను హాజరు కానివ్వలేదు. అసద్ కూడా ఎన్కౌంటర్లోనే మరణించాడు. ఇంత కట్టుదిట్టం చేసినవారు ఆసుపత్రికి హఠాత్తుగా ఎందుకు తీసు కోచ్చారు అంటే సమాధానం లేదు. ఒక వేళ తమకు ముందే చెప్పి ఉంటే నిర్బంధంలో ఉన్న వారి దగ్గరికే వైద్య బృందాన్ని పంపించి ఉండేవాళ్లం అని ఆసుపత్రి వర్గాల వారు అంటున్నారు.
అతీఖ్ అహమద్ను ఆయన సోదరుడిని హతమార్చడం దైవ నిర్ణయం అని ఉత్తరప్రదేశ్ ఆర్థికమంత్రి సురేశ్ఖన్నా అన్నారంటే యోగీ ప్రభుత్వం ఎన్కౌంటర్ల విషయంలో ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఖాతరుచేయడం లేదని రుజువు అవుతోంది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ మంగళ వారం మరో సందర్భంలో మాట్లాడుతూ ఏ మాఫియా ముఠా కూడా పరిశ్రమలకు అడ్డు తగలలేదని హామీ ఇవ్వడం కూడా ఎన్ కౌంటర్లను ఆయన ప్రభుత్వం ఒక విధానంగా అనుసరిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. అతీఖ్ అహమద్ గుజరాత్ జైలులో ఉంటే ఇంకో కేసులో విచారణ కోసం ప్రయాగ్రాజ్ (అలహాబాద్) తీసుకొచ్చారు. అప్పుడే ఉత్తరప్రదేశ్ పోలీసులు తనను మట్టు బెడ్తారని అతీఖ్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే జరిగింది. తనను అలహాబాద్ జైలుకు తరలించకూడదని పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అతీఖ్ ను గుజరాత్ నుంచి అలహాబాద్ తీసుకెళ్లడం అంటే మరణ శిక్ష విధించినట్టేనని అతీఖ్ న్యాయవాది మొరపెట్టుకున్నారు. ఆయన వ్యక్తం చేసిన భయాందోళన నిజమైంది. అతీఖ్, అష్రాఫ్కు కావలసిన భద్రత కల్పిస్తామని యోగీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీఇచ్చింది. తమ ఆదేశాన్ని ధిక్కరించిన యోగీ ప్రభుత్వం విషయంలో సుప్రీంకోర్టు ఏం చర్య తీసుకుంటుందో తెలియదు కానీ యోగి ఇచ్చిన హామీ కూడా బాబరీ మసీదు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఇచ్చిన హామీలాగే ఉల్లంఘించడానికే ఉపకరించింది. మాఫియాను మట్టిగరిపిస్తాం అని గత ఫిబ్రవరిలో యోగి ఆదిత్య నాథ్ చేసిన ప్రకటనను సుప్రీంకోర్టు ఎందుకు పరిగణించలేదో అంతుబట్టదు. యోగి ప్రకటనను అత్యున్నత న్యాయస్థానం చట్ట వ్యతిరేకమైందిగా భావించి ఉండాల్సింది. యోగి ఆదిత్యనాథ్ నేరస్థులను మట్టు బడ్తాం అని చెప్తున్నా ఆయన సామాజిక వర్గానికి చెందిన 32 మంది మాఫియానాయకులు ఇప్పటికీ బలాదూరుగా తిరుగుతూనే ఉండడం యోగిపాలనలో పక్షపాతవైఖరికి నిదర్శనం. ఇదే యోగీ ఆదిత్య నాథ్ లోకసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 2006లో తన ప్రాణాలకు ముప్పు ఉంది కనక భద్రత కల్పించాలని అప్పటి లోకసభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ముందు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం ఆటవిక న్యాయం అమలు చేస్తున్నారు. ఆయనకు చట్టబద్ధ పాలన మీద ఏ మాత్రం నమ్మకం లేదు. జనవాణిని లెక్క చేయరు. చట్టాన్ని ఉల్లంఘించి బుల్డోజర్ల ద్వారా సామాన్యుల, ముఖ్యంగా ముస్లింల ఇళ్లు కూల్చి వేయడం, ఎన్కౌంటర్లను ఆశ్రయించడం ఆయన పాలన ఎంత ప్రజాకంటకమైందో తెలియజేస్తోంది. హంతకులు ముగ్గురూ అతీఖ్, అష్రాఫ్ను పోలీసులు తీసుకు రాక ముందే వైద్యకళాశాల ఆసుపత్రి దగ్గర ప్రత్యక్షమయ్యారు. నిర్బంధంలోఉన్న వారిని ఆసుపత్రికి తీసుకొస్తున్నట్టు పోలీసులు చెప్పకపోతే పత్రికా ప్రతినిధులైనా సంఘటనాస్థలానికి ఎందుకు వస్తారు. ఈ విలేకరుల మొఖాలు పోలీసులకు పరిచితమైనవేగా! అలాంటప్పుడు హంతకులు విలేకరులలో కలిసిపోయి హత్యకు పాల్పడ్డారంటే నమ్మడం కష్టం.