. రైతులకు పరిహారమివ్వండి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర-పెనుగంచిప్రోలు : అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మిరప పంటను రామకృష్ణ ఇతర సీపీఐ నేతలు గురువారం పరిశీలింశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ అకాల వర్షాలకు మిర్చి, పత్తి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో ఎకరాకు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చిందన్నారు. రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని తెలిపారు. రామకృష్ణ వెంట సీపీఐ ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ సెక్రెటరీ దోనేపుడి శంకర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నగరాముడు, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి అంబోజు శివాజీ, పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు, చలపతిరావు, ఏఐవైఎఫ్ పట్టణ కార్య నిర్వాహక అధ్యక్షుడు యాండ్రపల్లి భాను తదితరులు ఉన్నారు.