కొత్త సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. ఈ ప్రకటనపై రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ టికాయత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టాల రద్దుపై ప్రకటన చేసినప్పటికీ ఆందోళనను ఇప్పటికిప్పుడే విరమించబోమని పేర్కొన్నారు. పార్లమెంటులో మూడు చట్టాల రద్దు జరిగే రోజు వరకు ఎదురుచూస్తుంటామన్నారు. ఇక కనీస మద్దతు ధరతోపాటు మిగిలిన అంశాలపై కూడా ప్రభుత్వం రైతులతో చర్చించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక సాగు చట్టాల రద్దుపై మోదీ ప్రకటన చేయడంతో దేశ రాజధాని సరిహద్దుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొన్న రైతు నేతలు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కేంద్రం నిర్ణయంపై సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు హర్హం వ్యక్తంచేశారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.