100 జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఇకపై రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ 4జీ సేవలు అందనున్నాయి. ఇందుకోసం వివిధ జిల్లాల్లో నెలకొల్పిన 100 జియో టవర్లను గురువారం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా సీఎం జగన్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్ జిల్లాలో 2 టవర్లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా 209 మారుమూల ప్రాంతాల గ్రామాలకు ఇంటర్నెట్ 4జీ సేవలు అందుబాటులోని రానున్నాయి. భవిష్యత్తులో 5జీ సేవలను జియో అందుబాటులోకి తేనుంది. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఈ టవర్ల ఏర్పాటు కారణంగా మారుమూల ప్రాంతాల్లో మరింతగా ప్రభుత్వ సేవలు మెరుగుపడనున్నట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింత కనెక్టివిటీ, మెరుగైన నాణ్యతతో సేవలు అందనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు ఇ- లెర్నింగ్ సౌకర్యం మరింత అందుబాటులోకి వస్తుందని, ఆరోగ్యసేవలు కూడా మెరుగుపడతాయన్నారు. రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకూ వారి ముంగిటకే సేవలు అందించడానికి యూనివర్సిల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) ద్వారా సెల్టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని సీఎం వివరించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెల్ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్ అప్లోడ్ చేసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఏర్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో మాట్లాడి, మార్గదర్శకాలను సులభతరం చేయడం ద్వారా సెల్టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు కింద కొత్తగా 2,849 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు చేయనుండగా, దీనికోసం ఇప్పటికే 2,463 చోట్ల స్థలాల్ని ప్రభుత్వం అప్పగించిందన్నారు. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి, జియోకు, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ అందిరికీ సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు రానున్నట్లు ప్రకటించారు. సంక్షేమ పథకాలును అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు అందించగలుగుతామని సీఎం అన్నారు. కొత్తగా సెల్టవర్లు ప్రారంభించిన నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో ముఖ్యమంత్రి నేరుగా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమరనాథ్, సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్, రిలయెన్స్ జియో ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.