అనిల్ దేశ్ముఖ్కు కోర్టులో చుక్కెదురు
14 రోజలపాటు జ్యుడీషియల్ రిమాండ్
ముంబై : మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ (71)కు పీఎంఎల్ఏ ప్రత్యేకకోర్టు మరో 14రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా ఇంటి నుంచి ఆహారం, ఔషధాలను అనుమతించాలని అనిల్ దేశ్ముఖ్ తరపున న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘ముందు కొన్ని రోజులపాటు జైలు ఆహారం తినండి. జైలు ఆహారంపై ఏదైనా ఫిర్యాదు ఉంటే మా దృష్టికి తీసుకురండి. అప్పుడు మీ విజ్ఞప్తిని పరిశీలిస్తాం’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. వయసురీత్యా నేలపై పడుకోలేరని, అందుకు బెడ్కు అనుమతి ఇవ్వాలని అనిల్ తరపున న్యాయవాది కోరగా అందుకు మాత్రం న్యాయస్థానం అంగీకరించింది. కోట్లాది రూపాయల మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ముఖ్ను ఈడీ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు ప్రత్యేక న్యాయమూర్తి హెచ్ఎస్ సతాభాయ్ ముందు హాజరు పరిచారు. తదుపరి విచారణ కోసం ఈడీ కోరకపోవడంతో దేశ్ముఖ్ను న్యాయమూర్తి నేరుగా జైలుకు పంపారు. మనీలాండరింగ్ కేసులో సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత దేశ్ముఖ్ను ఈడీ నవంబరు ఒకటవ తేదీన అరెస్టు చేసింది.