: మమతాబెనర్జీ
బీజేపీ సర్కారుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెగాసస్ స్పైవేర్తో అనేక మంది నేతలపై నిఘా పెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై స్వీయ విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆన్లైన్లో బుధవారం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాను నిఘా నుంచి తప్పించుకోవడం కోసం తన మొబైల్ ఫోన్ కెమెరాకు ప్లాస్టర్ వేసేశానని, ఇక కేంద్ర ప్రభుత్వానికి ప్లాస్టర్ వేయవలసి ఉందని చెప్పారు. లేనిపక్షంలో దేశం నాశనమవుతుందని హెచ్చరించారు. సమాఖ్య నిర్మాణాన్ని బీజేపీ అణగదొక్కిందన్నారు. ఇజ్రాయెల్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ అతి ప్రమాదకరం, భయంకరమైందని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయింది ఇపుడిక తాను ఇతర ప్రతిపక్ష నాయకులతో గానీ, ప్రజలతో స్వేచ్ఛగా మాట్లాడలేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు నిధులివ్వరు కానీ స్పైవేర్లకు కోట్లు ఖర్చు చేస్తారన్నారు. పెగాసెస్పై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు. అలాగే ఢల్లీిలో జులై 27 లేదా 28 తేదీల్లో ప్రతిపక్ష పార్టీల భేటీ ఏర్పాటు చేయాలని, తాను హాజరుకానున్నట్టు మమత చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఖేలా హోబె నినాదంతో మోదీ సవాల్కు విసిరిన దీదీ ఇపుడిక దేశంనుంచి బీజేపీని తరిమికొట్టే దాకా ఖేలాహోబె దివస్ జరపాలన్నారు. ఆగస్టు 16న అన్ని రాష్ట్రాల్లోను ఖేలా దివస్ నిర్వహించాలన్నారు. ఈ నేపథ్యంలో పేద పిల్లలకు ఫుట్బాల్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.