సీపీఐ జాతీయ సమితి సమావేశం చర్చల్లో వక్తలు

పుదుచ్చేరి : దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సెక్యులర్ పార్టీలన్నీ కలిసి పోరాడాలని ఇక్కడ జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశంలో నాయకులు ఉద్ఘాటించారు. మార్క్సిజం లేకుండా ఎవరూ మనుగడసాగించలేరని స్పష్టంచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఆదివారం ప్రవేశపెట్టిన రాజకీయ నివేదికపై వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు చర్చలో పాల్గొన్నారు. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, బంత్ సింగ్ బ్రార్, సలీమ్ అధ్యవర్గంగా వ్యవహరిస్తున్నారు. నాగాలాండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో మొదటిసారిగా సీపీఐ పోటీచేయడాన్ని జాతీయ సమితి సభ్యులు స్వాగతించారు. మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కారల్మార్క్స్పై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇటీవల చేసిన వ్యాఖ్యలను వక్తలు ముక్తకంఠంతో ఖండిరచారు. ప్రజాసమస్యలపై అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నుంచి కార్మికదినోత్సవం మే 1వ తేదీ వరకు పాదయాత్రలు నిర్వహించాలన్న పార్టీ ప్రధానకార్యదర్శి డి. రాజా ప్రతిపాదనను సభ్యులు చర్చలో ప్రస్తావించారు. రానున్న ఎన్నికలు ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమాయత్తంకావాలని సూచించారు. పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరుచుకునేందుకు అవసరమైన నిధి సేకరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రతిపాదించారు. పార్టీ నిర్మాణం, నిధివసూళ్లపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి అట్టడుగుస్థాయి నుంచి కృషి చేయాలన్నారు. నిధివసూళ్లపై ప్రధానంగా దృష్టికేంద్రీకరిం చాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ నిర్వహించిన కార్యకలాపాలను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీఎస్ఎన్ మూర్తి సమావేశంలో వివరించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా 78వ జన్మదినం సందర్భంగా ఆయనకు పార్టీ నాయకత్వం, జాతీయ సమితి సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా నాయకులు కేక్ కోయించి వేడుకలు నిర్వహించారు.