అసెంబ్లీ స్పీకర్కు వైసీపీ అధినేత జగన్ లేఖ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్ర శాసనసభలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మంగళవారం ఆయన ఒక లేఖ రాశారు. ఈనెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగిందన్నారు. అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం చేయాలి… కానీ అలా జరగలేదని గుర్తుచేశారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని జగన్ వివరించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని, పార్లమెంటులోకానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగానీ ఈ నిబంధన పాటించలేదని స్పష్టంచేశారు. అధికార కూటమి, మీరు… ఇప్పటికే నాపై శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, అందుకు నిదర్శనంగా ‘ఓడిపోయాడు కాని చావలేదు, చచ్చే వరకూ కొట్టాలి’ అంటూ… మీరు మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని జగన్ గుర్తుచేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారంటూ జగన్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్-1953 చట్టంలోని 12-బీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించారని తెలిపారు. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోందన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకుని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైసీపీనేనని స్పష్టంచేశారు. ఈనెల 21న జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూస్తే… వైసీపీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడంలోగాని, ఆపార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నాకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలోగానీ, మీ ఉద్దేశాలేంటో బయటపడ్డాయని పేర్కొన్నారు. చట్టాన్ని బట్టి చూస్తే, వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగాని, ఆపార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్షనేతగా మీరు గుర్తించడంలో ఎలాంటి సందిగ్ధతకు తావులేదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 40 శాతం ఓట్లను సాధించిందని, ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుందని, దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారని తెలిపారు.
సీట్లతోనే ప్రధాన ప్రతిపక్షం గుర్తింపు: జగన్
అసెంబ్లీ సీట్లలో 10శాతం సీట్లు రానందున వైసీపీ శానసభాపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతోందని జగన్ తెలిపారు. భారత రాజ్యంగం ప్రకారం… ఆర్టికల్-208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో పలానా సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని మీ ముందుకు తెస్తున్నానని అనేక చట్టసభల అంశాలను జగన్ వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తుచేశారు. 1984 లోక్సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుందని, సభలో 10శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని ఉదాహరించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించిందని, 10 శాతం సీట్లు కాంగ్రెస్కు లేకపోయినప్పటికీ పి.జనార్థనరెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారన్నారు. 2015లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగాను బీజేపీ కేవలం మూడు సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తీసుకువస్తున్నానని జగన్ చెప్పారు.
ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ మీకు రాస్తున్నానని, అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా ఇప్పటికే అధికార కూటమి శతృత్వాన్ని ప్రదర్శిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే… అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న మీ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యాబలాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని జగన్ కోరారు.