అధికారికంగా ప్రకటించిన స్పీకర్
న్యూదిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని స్పీకర్ ఓంబిర్లా గుర్తించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్గాంధీని గుర్తించాలని లోక్సభ సెక్రటేరియట్కు కాంగ్రెస్ ప్రతిపాదించిన మరుసటి రోజు ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించినట్లు లోక్సభ సెక్రటేరియట్ బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులకు వేతనాలు, ప్రోత్సాహకాల చట్టం`1977లోని 2వ సెక్షన్ కింద విపక్ష నేతగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ కాంగ్రెస్ ఎంపీకి గుర్తింపు లభించింది. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా తిరిగి ఎన్నికయ్యారు. ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్రధాని మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో పాటు విపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ వెళ్లారు. తనకు ఈ హోదా కల్పించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గేకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ‘దేశవ్యాప్తంగా లభించిన అమితాదరణ, ప్రేమానురాగాలు, అభినందనకుగాను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే, పార్టీ నేతలతో పాటు ‘బబ్బర్షేర్’ కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. మనం కలిసికట్టుగా ప్రతి ఒక్క భారతీయుడి గొంతుకను పార్లమెంటులో వినిపిద్దాం. రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం, ఎన్డీఏ ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నిద్దాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.