న్యూదిల్లీ : దేశంలో అడ్డగోలుగా పుట్టుకొస్తూ ప్రజలను ఆకర్షించి… ఆ తర్వాత వారి మానసిక వేదనకు కారణమవుతున్న రుణ, బెట్టింగ్ యాప్లపై కొరడా రaుళిపించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ యాప్ల ద్వారా చిన్న మొత్తంలో రుణాలు పొందిన సామాన్యులను ఘోరంగా దోపిడీకి, వేధింపులకు గురిచేసి అనేకమంది ఆత్మహత్యలకు దారితీస్తోన్న ఈ దా‘రుణ’ యాప్ల వ్యవహారంపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని చైనాతో సంబంధం ఉన్న 138 బెట్టింగ్ యాప్లు, 94 రుణ చెల్లింపుల యాప్లను అత్యవసర ప్రాతిపదికన నిషేధించడానికి సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖకు హోంశాఖ వ్యవహారాల శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ యాప్లను బ్లాక్ చేసే ప్రక్రియను ఇప్పటికే కేంద్ర ఐటీశాఖ ప్రారంభించినట్టు ప్రభుత్వ ఉన్నత వర్గాలు పేర్కొన్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం ఈ యాప్లు దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని నిర్థారణకు వచ్చిన తర్వాత ఈ చర్యలకు ఉపక్రమించింది. చైనా వ్యక్తులు ఈ యాప్లకు డైరెక్టర్లుగా భారతీయులను నియమించి తమ వ్యూహాలు అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిరాశకు గురైన వ్యక్తులు ఈ యాప్ల ద్వారా రుణాలు తీసుకొనేందుకు ఆకర్షితలవుతున్నారు. ఆ తర్వాత యాప్ నిర్వాహకులు ఏటా దాదాపు 3వేల శాతం మేర వడ్డీ పెంచేస్తున్నారు. రుణం తీసుకున్నవారు ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే ఈ యాప్లకు చెందిన ప్రతినిధులు వేధింపులకు పాల్పడుతున్నారు. రుణాలు తీసుకున్న వారికి అసభ్యకర సందేశాలు పంపడంతో పాటు వారి ఫోన్లో ఉన్న ఫొటోలు తీసుకొని మార్ఫింగ్ చేసి వాటిని బయటపెడతామని బెదిరించడం వంటి కిరాతక చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రుణాలు తీసుకున్నవారు లేదా బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకొని కొందరు ఆత్మహత్యలకు పాల్పడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సైతం ఈ యాప్లపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరడంతో…రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ ఆరు నెలల క్రితం 28 చైనా రుణ చెల్లింపు యాప్లను విశ్లేషించింది. అయితే, 94 యాప్లు ఈ-స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని, మరికొన్ని థర్డ్-పార్టీ లింక్ల ద్వారా పనిచేస్తున్నట్టు గుర్తించింది. 2020 జూన్ నుంచి కేంద్ర ప్రభుత్వం 2 వేలకు పైగా చైనా యాప్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.