. పోక్సో కేసు తొలగించాలని దిల్లీ పోలీసుల నివేదిక
. మరో కేసులో వెయ్యి పేజీల చార్జిషీటు దాఖలు
న్యూదిల్లీ: అగ్రస్థాయి మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై తీవ్ర ఆరోపణలు ఉన్న క్రమంలో దిల్లీ పోలీసులు గురువారం ఆయనపై వెయ్యి పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. అందులో 500 పేజీలు ఆయనకు ఏ విధంగా క్లీన్చిట్ ఇవ్వాలో పోలీసులు వివరించారు. అలాగే పోక్సో కేసును తొలగించాలని కూడా సిఫార్సు చేశారు. ఈ మేరకు నివేదికను సీఆర్పీసీ సెక్షన్ 173 కింద సమర్పించారు. బ్రిజ్భూషణ్పై చార్జిషీటును ఐపీసీలోని 354 (మానభంగం ఉద్దేశంతో మహిళను వేధించడం) 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంబడిరచడం), 506 (క్రిమినల్ బెదిరింపులు) సెక్షన్ల కింద దాఖలు చేశారు. ఈ మేరకు ప్రత్యేక పోలీసు ప్రాసిక్యూటర్ అటుల్ శ్రీవాత్సవ తెలిపారు. ‘దర్యాప్తు పూర్తై తర్వాత మైనర్ రెజ్లర్, ఆమె తండ్రి వాంగ్మూలాల ఆధారంగా బ్రిజ్భూషణ్పై పోక్సో కేసు తొలగింపును కోరుతూ నివేదిక సమర్పించాం. దర్యాప్తులో ఆ కేసును ధ్రువీకరించే సాక్ష్యాలు లభించలేదు. ఇక రెజ్లర్లకు సంబంధించిన కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేశాం’ అని దిల్లీ పోలీస్ పీఆర్ఓ సుమన్ నల్వా తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శిగా సస్పెండ్ అయిన వినోద్ తోమర్పైనా ఐపీసీలోని 109 సెక్షన్ కింద చార్జిషీటు దాఖలైందన్నారు. పోక్సో కేసు తొలగించాలన్న నివేదికపై జులై 4న పాటియాలా హౌస్ కోర్టులో అదనపు సెషన్స్ జడ్జి రాజిందర్ సింగ్ విచారణ చేపట్టనున్నారు. మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై దాఖలైన మరొక కేసును రౌసే అవెన్యూ కోర్టులో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీపక్ కుమార్ ఈనెల 22వ తేదీన విచారిస్తారు. బ్రిజ్భూషణ్పై ఆరుగురు మహిళా రెజర్ల ఫిర్యాదుతో తొలి ఎఫ్ఐఆర్ నమోదు కాగా, మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్ఐఆర్ను ఏప్రిల్ 28న నమోదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం మొత్తం 180 మందిని విచారించింది. గోండాలోని బ్రిజ్భూషణ్ ఇంటికి వెళ్లి ఆయన బంధుమిత్రులు, సహచరులు, సిబ్బంది వాంగ్మూలాలు సేకరించింది. న్యూదిల్లీలోని బ్రిజ్భూషణ్ కార్యాలయానికి మహిళా రెజ్లర్లను తీసుకెళ్లి సీన్ రిక్రేట్ చేసింది.
భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నాం: రెజ్లర్లు
తాజా పరిణామాలపై రెజ్లర్ సాక్షి మాలిక్ భర్త, రెజ్లర్ సత్యవర్త్ కాడియన్ స్పందిస్తూ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని, ఇంకా నిర్ణయం జరగలేదని, చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈనెల 7వ తేదీన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్తో భేటీ అనంతరం తమ ఆందోళనను రెజ్లర్లు వాయిదా వేసుకున్నారు. ఇచ్చిన గడువులోగా బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళాధికారి అధ్వర్యంలో డబ్ల్యూఎఫ్ఐలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. వారి ప్రతిపాదనలను కేంద్రమంత్రి ఆమోదించారు. దీంతో తమ ఆందోళనకు ఈనెల 15 తేదీ వరకు విరామమిచ్చినట్లు రెజ్లర్లు వెల్లడిరచారు. బ్రిజ్భూషణ్ అరెస్టును వారు డిమాండ్ చేస్తుండటం విదితమే.