Monday, March 20, 2023
Monday, March 20, 2023

మరింత ముందుకు

. మీ నమ్మకాన్ని వమ్ము చేయం
. ఒప్పందాల అమలు దిశగా ప్రతివారం కమిటీ సమీక్ష
. 352 ఒప్పందాలకు రూ.13,05,663 కోట్లు
. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ముగింపు సభలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో`విశాఖపట్నం : మీ విశ్వాసంతో మరింత ముందుకు వెళతామని, మీ నమ్మకాన్ని వమ్ము చేయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 రెండు రోజుల సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సును విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సు ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసం తనను మరింత ఉప్పొంగేలా చేసిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధి చెందేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు తమ నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుందని, మీతో తమ బంధం చాలా అమూల్యమైనదన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి ఈ సదస్సు అద్భుతంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి ఈ సదస్సు కల్పించిన వాతావరణం ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ శరవేగంతో తిరిగి పుంజుకుందని, కోవిడ్‌ మహమ్మారి విస్తరించి, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైన పరిస్థితులలో కూడా అనేక రంగాలకు తమ ప్రభుత్వం సమయానుకూలంగా ప్రోత్సాహం ఇచ్చిందని తెలిపారు. సుపరిపాలన, సమర్థవంతమైన విధానాలు ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలవడమే కాకుండా ద్రవ్య లోటును నియంత్రణలో ఉంచాయని అన్నారు. అంతేకాకుండా వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా చూసిందని అన్నారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా ఇంటర్‌నెట్‌, బ్రాడ్‌బాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి యువతలో నైపుణ్యాలు మరింత మెరుగయ్యేలా చేశామని ఆయన చెప్పారు. ఈ సదస్సులో వివిధ రంగాలపై 15 సమావేశాలు నిర్వహించామని, 100 మందికి పైగా మాట్లాడారని, ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న బలాలేంటో చెప్పారని అన్నారు. ఆటో మొబైల్‌, ఈవీ, హెల్త్‌కేర్‌, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమోనియా, అగ్రి ప్రాసెసింగ్‌, పర్యాటకం తదితర రంగాలు ఇందులో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సహకారం కోసం మరిన్ని అవకాశాలు అన్వేషించేందుకు యూఏఈ, నెదర్లాండ్స్‌, వియత్నాం, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో మరో నాలుగు చర్చా గోష్ఠులు కూడా నిర్వహించామన్నారు. సదస్సులో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌ ఎరీనా అందరినీ ఆకట్టుకుందని, ఒక జిల్లాఒక ఉత్పత్తి (ఒన్‌ డిస్ట్రిక్ట్‌ఒన్‌ ప్రొడక్ట్‌) ఇతివృత్తం ఆధారంగా 137 స్టాళ్లను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా ఈ రెండు రోజులపాటు కేంద్రం మంత్రులు, విదేశీ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, రాయబారులు, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి చర్చలు జరపడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశాలన్నీ అత్యంత ఫలప్రదంగా సాగాయని, పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు.
352 ఎంఓయూలు… రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు
రాష్ట్రంతో భాగస్వామ్యానికి సంబంధించి మేము చూపిన దృఢమైన నిబద్ధత, సానుకూల వ్యాపార పరిస్థితుల కారణంగా సదస్సులో రూ.13,05,663 కోట్ల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. వీటివల్ల 6,03,223 మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఒక్క ఎనర్జీ రంగంలోనే రూ.8,84,823 కోట్లకు సంబంధించి 40 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నామని, 1,90,268 మందికి దీనివల్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐటీ, ఐటీఈ రంగానికి సంబంధించి రూ.25,587 కోట్లతో 56 ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా 1,04,442 మందికి ఉద్యోగాలు వస్తాయని, పర్యాటక రంగంలో రూ.22,096 కోట్లతో 117 ఎంఓయూలు కుదుర్చుకోవడం వల్ల 30,787 మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. రెన్యువబుల్‌ ఎనర్జీలో గణనీయంగా పెట్టుబడులు వచ్చాయని సీఎం చెప్పారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్‌ స్ట్టోరేజీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమోనియా ఉత్పత్తికి సంబంధించి వస్తున్న పెట్టుబడులు పునరుత్పాదక శక్తికి సంబంధించిన క్లిష్టతలను పూర్తిగా తగ్గిస్తాయని, శిలాజ ఇంధన ఆధారిత ఉత్పత్తికి విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తాయన్నారు. కర్బన రహిత లక్ష్యంగా, గ్రీన్‌ ఎనర్జీ దిశగా అడుగులేస్తున్న దేశానికి తన లక్ష్య సాధనలో చక్కటి సహకారాన్ని అందిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పెట్టుబడుదారులను ఉద్దేశించి సీఎం అన్నారు. ఎంఓయూలు కుదుర్చుకున్న వారంతా వీలైనంత త్వరగా తమ పెట్టుబడులతో రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. దీనికోసం అన్నిరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందని, మీ వ్యాపారాలు ప్రారంభించడానికి, పరిశ్రమలు పెట్టేందుకు వేగవంతంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా సదుపాయాలను కల్పిస్తుందని తెలిపారు. వీటిని సాకారం చేసేందుకు ఒక మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఇందులో సభ్యులుగా ఉంటారని, ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఒప్పందాల అమలు దిశగా కృషి చేస్తుందని చెప్పారు. మీ రోజువారీ కార్యకలాపాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని ఈ కమిటీ పరిష్కరిస్తూ ఈ పెట్టుబడులు ఫలప్రదమయ్యేలా ఆటంకాలు లేకుండా చూస్తుందని సీఎం అన్నారు.
సదస్సు వేదికగా రూ.3841 కోట్ల విలువైన 14 యూనిట్లు ప్రారంభం
సదస్సు వేదికగా శనివారం రూ.3841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. దీనివల్ల 9,108 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని, కింబర్లే క్లార్క్‌, బ్లూస్టార్‌, క్ల్కెమాటెక్‌, లారస్‌ ల్యాబ్‌, హేవెల్స్‌ ఇండియా, శారదా మెటల్స్‌, అల్లాయిస్‌ తదితర కంపెనీలు ఈ పెట్టుబడులు పెట్టాయని ఆయన చెప్పారు. ఈ కంపెనీలను ప్రారంభించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. రెండో రోజు సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, కేంద్ర షిప్పింగ్‌, సహజ వాయువుల శాఖ మంత్రి సద్భానంద్‌ సోనోవాల్‌తో పాటు అనేక సంస్థల పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి జ్ఞాపికలు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img