
ఇది మడమ తిప్పడం కాదా ?
. సీఎం జగన్పై నిరుద్యోగుల ఆగ్రహం
. ఖాళీ ఉద్యోగాల భర్తీపై ఏఐవైఎఫ్ రాష్ట్రవ్యాప్త ధర్నాలు
. స్పందించకుంటే సమాధి కడతాం: రాజేంద్ర, లెనిన్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగాలిస్తానని మాట ఇచ్చి…తమ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ నాలుగేళ్లు దాటినా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా నిలువునా మోసగించారని ఆగ్రహం వెలిబుచ్చారు. మాట తప్పను…మడమ తిప్పను అంటూ పదే పదే డాంబికాలు పలికే ముఖ్యమంత్రి…దీనికేమి సమాధానం చెబుతారని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగ భేరీలు, యువభేరీలు నిర్వహించిన జగన్…అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నిరుద్యోగులను కలవడానికి కూడా ఇష్టపడలేదని ఆరోపించారు. నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారని, ఇప్పటికైనా దీనిని సరిచేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం రాష్ట్రవాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నాలు నిర్వహించారు. నిరుద్యోగులు, యువజన, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ ధర్నా చౌక్లో యువజనులు అర్ధనగ్నంగా, తలకిందులుగా నిలబడి వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు పాల్గొనగా, నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నక్కా లెనిన్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 ,35,794 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందుకోసం యేటా జనవరిలో ఉద్యోగ ప్రకటనల కాలపట్టిక (జాబ్ క్యాలెండర్) ప్రకటిస్తామని జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు మాటిచ్చి మోసం చేశారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క శాఖలోనూ ఖాళీ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు, కరోనా కాలంలో వైద్యశాఖలో అరకొరగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో కొన్ని పోస్టులు మాత్రమే అధికార పార్టీ కార్యకర్తలకు అమ్ముకున్నారని విమర్శించారు. ఏపీపీఎస్సీ ద్వారా 4594 పోస్టులు మాత్రమే భర్తీ చేసిందని, ఖాళీగా ఉన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1,2,4 తోపాటు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎడ్యుకేట్, ఇంజినీరింగ్, పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ కళాశాల అధ్యాపకులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు వంటి ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. ప్రాథమిక పరీక్షలో ఆర్హత సాధించిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించాలని, పశు సంవర్ధక శాఖలోని అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఏపీపీఎస్సీ గ్రూప్ 1,2, 4తోపాటు వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని, మెగా డీఎస్సీ విడుదల చేసి ఖాళీగా ఉన్న 55 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు, గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న 20వేల ఉద్యోగాలు, వివిధ ప్రభుత్వ, ఎయిడెడ్, విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపక పోస్టులు, వివిధ శాఖలలోని ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక (ప్రిలిమ్స్), ప్రధాన (మెయిన్స్) పరీక్ష విధానం రద్దుచేసి
ఒకే పరీక్ష నిర్వహించాలని, నెగిటివ్ మార్క్ల విధానం ఎత్తివేయాలని, ఏపీపీఎస్సీ ఇతర ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నపత్రాలు తెలుగును ప్రామాణికం చేసుకొని తయారు చేయాలని, వయోపరిమితి 45 సంవత్సరాలకు పెంచాలని, ప్రతి జిల్లాలో ప్రభుత్వ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అంటూ నమ్మించి…అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల బాధలు వినడానికి ఇష్టపడటం లేదని మండిపడ్డారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని, బాధలను అర్థం చేసుకుని తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఈ ప్రభుత్వానికి సమాధి కడతారని హెచ్చరించారు.
విజయవాడ ధర్నాచౌక్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పరుచూరి రాజేంద్ర బాబుతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు లంకా గోవిందరాజులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుటూరి అరుణ్కుమార్, నంద్యాల కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో నక్కి లెనిన్ బాబుతోపాటు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రణత్యాదవ్, నాగరాముడు పాల్గొన్నారు. కడప కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వి.గంగాసురేశ్, దస్తగిరి, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి కన్వీనర్ షేక్ సిద్ధిక్, కర్నూలులో కారుమంచి శ్రీనివాస్, అనంతపురంలో మోహన్, కృష్ణ, తిరుపతిలో కత్తి రవి, రామకృష్ణ, నెల్లూరులో మున్నా, ఒంగోలులో కరుణానిధి, గులాం హుస్సేన్, నరసరావుపేటలో షేక్ సుభానీ, గుంటూరులో చైతన్య, వలి, దాసు, శ్రీనివాస్, విజయవాడలో బేవర శీను, ఏలూరులో తొర్లపాటి రాజా, సురేశ్, కాకినాడలో బాబి, నాని, అనకాపల్లిలో రాజు, కన్నబాబు, నర్సీపట్నంలో రాధాకృష్ణ, విశాఖపట్నంలో రాంబాబు, విజయనగరంలో యుగంధర్, అప్పన్న, వాసు, నాగభూషణం, పార్వతీపురంలో గోపి నాయుడు, శ్రీకాకుళంలో శ్రీనివాస్, వాసుదేవరావు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాము, లక్ష్మణ్, సత్యసాయి జిల్లాలో బిల్లు కుల్లాయప్ప యాదవ్, అన్నమయ్య జిల్లాలో జక్కుల వెంకటేశ్, టి.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు