చండీగఢ్ : ఉత్తరప్రదేశ్, బీహార్ సోదరులను పంజాబ్లో ప్రవేశించనివ్వొద్దని పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్జిత్సింగ్ చన్నీ పిలుపునిచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు అక్కడే ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చిరునవ్వులు చిందించారు. యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ వెళ్తున్న నేపథ్యంలో చన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. టెలీ ఓటింగ్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీ పేరును ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చన్నీలలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలో తెలియజేయాలని కోరినపుడు…అత్యధికులు చన్నీనే సమర్థించారు. చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో దళిత ఓటర్ల మనసు గెలుచుకోవచ్చునని కాంగ్రెస్ భావిస్తోంది. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం మంది దళితులు ఉన్నారు. జాట్ సిక్కులు పంజాబ్ రాజకీయాల్లో ప్రముఖ స్థానంలో ఉన్నారు. దళిత నేత ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి. 117 స్థానాలున్న పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరగనున్నాయి.