ప్రభుత్వ ఉత్తర్వులు సక్రమంగా అమలు చేయాలి
అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
విశాలాంధ్ర-విజయవాడ: సమస్యల పరిష్కారానికి గ్రామ సచివాలయం ఉద్యోగులు రోడ్డెక్కారు. గ్రామ, వార్డు సచివాలయంలో పని చేస్తున్న వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు ఆదివారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద ‘జగనన్నకు చెబుదాం’ సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలోని 26 జిల్లాలలో పని చేస్తున్న దాదాపు వెయ్యి మందికి పైగా సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్యను అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకుని సత్కరించారు. అనంతరం ఈశ్వరయ్య ప్రసంగిస్తూ వీరి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చొరవ చూపాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజకీయ నిర్ణయమైన చెత్త సేకరణ పన్నుపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్న తరుణంలో వారు పన్ను కట్టకపోతే సెక్రటరీలను మీ జీతంలో నుంచి కట్టాలని వేధించడం ఎంతవరకు సబబో ఆలోచిం చాలన్నారు. వీరికి సంబంధం లేదని పారిశుధ్య పనులను అప్పగించి, కేవలం మేస్త్రిలాగా పనులు చేయిస్తూ, జాబ్ చార్ట్ను అమలు చేయకుండా వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు సాంకేతిక సేవలైన జనన-మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ, ఎన్విరాన్మెంట్ విధులు అయిన ప్లాస్టిక్ నియంత్రణ, ఫుడ్ సేఫ్టీ చెకింగ్ విధులు వెంటనే కేటాయించి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. అందుకే జగనన్నకు తమ గోడు వెళ్లబోసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వేలాది మంది సెక్రటరీలు విజయవాడ ధర్నా చౌక్కు వచ్చారని ఈశ్వరయ్య తెలిపారు. వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు జూన్ 1 నుంచి సచివాలయం సమయపాలన పాటిస్తారని, కమిషనర్లు సస్పెండ్ చేస్తే, వారి మీద కోర్టులో పోరాడతామని హెచ్చ రించారు. జీఓ నంబరు 650 ప్రకారం సచివాలయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సమయపాలన అమలు చేయాలని, సీడీఎమ్ఏ ఇచ్చిన సెలవుల ఉత్తర్వులు అన్ని మున్సిపాలిటీలలో అమలు చేయాలని, శానిటరీ ఇన్స్పెక్టర్, కమిషనర్ల వేధింపులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా సెక్రటరీలపై వేధింపులు ఆపాలని, ఇప్పటి వరకు ఇచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులను బేషరతుగా ఎత్తివేయాలని, చెత్త పన్ను విష యంలో వేధింపులు ఆపాలని కోరారు, శానిటరీ ఇన్స్పె క్టర్లను రిపోర్టింగ్ ఆఫీసర్గా తొలగించి, వారిని ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ లేదా కమిషనర్ను రిపోర్టింగ్ ఆఫీసర్గా పెట్టాలని కోరారు. సదస్సులో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వేధిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. సెలవుల జీవోను అమలు చేయకుండా ఉద్యోగుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, రోజుకు 10 నుంచి 14 గంటల పని చేయిస్తూ, కార్మిక చట్టాలను ఉల్ల్లంఘిస్తూ, వారిని వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలు, గర్భిణులు అని కూడా చూడకుండా సమయపాలన అమలు చేయకుండా సస్పెన్షన్ల పేరుతో హింసిస్తున్నారని, అటువంటి అధికా రులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పాల్గొని సంఫీుభావం తెలిపి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉండాలని అన్నారు. చట్ట సభల్లో కమ్యూనిస్టులు లేని కొరత కనిపిస్తోందని అన్నారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకులు శివ ఆదిమూర్తి, పార్థసారథి, పార్వతి, సృజన, పి.శ్రీకాంత్, గణేష్, నవీన్ కుమార్, గంట రామకృష్ణ, శ్యామ్, వెంకటేష్, మాధురి, బోయిన తిరుమలరావు, పవన్ కుమార్, హేమేష్ అహర్ని పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర బాబు, విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కోశాధికారి ఎం.సాయికుమార్, యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు లంక గోవింద రాజులు, నగర ఉపాధ్యక్షుడు లంకె సాయి తదితరులు పాల్గొని సంఫీుభావం తెలిపారు.