బెంగళూరు: ముడా (మైసూరు నగరాభివృద్ధి సంస్థ) కుంభకోణం కర్నాటక రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ తరుణంలో సిద్దరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసులు విచారించేందుకు సీబీఐకు అనుమతి ఉపసంహరించుకుంది. ఈ కుంభకోణంలో వాస్తవాలు వెలికి తీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో దర్యాప్తు చేయించాలని డిమాండ్లు వస్తోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ‘రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతి ఉపసంహరించుకుంటున్నాం. ఆ దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తారని ఆందోళన చెందుతున్నాం. వారిది పక్షపాత వైఖరి. ముడా కుంభకోణంతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. మేం సీబీఐకి ప్రతిపాదించిన అన్ని కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయలేదు. ఎన్నో కేసులు పెండిరగ్లో ఉన్నాయి. మేం రిఫర్ చేసిన కేసులను వారు తిరస్కరించిన సందర్భాలు అనేకం. వారు (సీబీఐని ఉద్దేశించి) తప్పుడు మార్గంలో పడకుండా నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కర్నాటక న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ గురువారం మీడియాతో మాట్లాడారు. అలాగే తన అనుమతి లేకుండా గవర్నర్ అడిగిన ఎలాంటి సమాచారం అందించకూడదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కర్నాటక కేబినెట్ ఆదేశాలు ఇచ్చింది. అనుమతిని నిరాకరించిన రాష్ట్రాల్లో… ఏదైనా కేసును సీబీఐ విచారించాల్సి వస్తే, దానికి ఆ ప్రభుత్వం రాతపూర్వక అనుమతి తప్పనిసరి. ఇప్పుడు బెంగాల్లో ఆర్జీ కర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న హత్యాచార ఘటనలో సీబీఐ దర్యాప్తు ఆ కోవలోనిదే. అంతకుముందు మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా కర్నాటక మాదిరిగానే అనుమతి ఉపసంహరించుకుంది.
ఇంకా ఆ జాబితాలో తమిళనాడు (డీఎంకే), కేరళ (వామపక్షకూటమి) వంటివి ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీని దుర్వినియోగం చేసిందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.