. ప్రతిపక్షాల సంచలన నిర్ణయం
. ఓం బిర్లా వర్సెస్ సురేశ్
. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి
. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్… బీజేపీ ససేమిరా
. అభ్యర్థిని బరిలో నిలిపిన ఇండియా ఐక్య సంఘటన
న్యూదిల్లీ: భారత దేశ రాజకీయాల్లో ఊహించని ఘటన! బీజేపీ ఏకపక్ష పోకడలతో ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వస్తున్న లోక్సభ స్పీకర్ పదవికి…స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి ఎన్నిక జరగనుంది. 18వ లోక్సభ స్పీకర్ పదవి కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తరపున ఓం బిర్లా, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా ఐక్య సంఘటన తరపున కే సురేశ్ పోటీపడనున్నారు. ఎన్డీఏ నుంచి రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా (బీజేపీ) నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 10 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, నడ్డా, బీజేపీ మిత్రపక్షాలు తెలుగుదేశం, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ ఆయనకు మద్దతుగా నామినేషన్ సెట్లు దాఖలు చేశాయి. ఇక విపక్ష ఇండియా ఐక్య సంఘటన తరపున కేరళ నుంచి 8సార్లు ఎంపీగా ఎన్నికైన కె.సురేశ్ (కాంగ్రెస్) నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా మూడుసెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. వాస్తవానికి సభాపతి పదవిని అధికార పక్షం, ఉప సభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా… గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉప సభాపతి పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే… డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేదంటే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ను బీజేపీ చర్చలకు పురమాయించింది. ఈ ఉదయం నుంచి ఆయన మల్లికార్జున్ ఖడ్గే, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సహా ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ.. ఉప సభాపతి పదవి కావాలన్న డిమాండ్ మళ్లీ ముందుంచాయి. దీనికి ఎన్డీయే సర్కారు సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. బుధవారం (జూన్ 26) ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యం కావడంతో కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది.
చర్చలు విఫలం
అంతకుముందు స్పీకర్ ఎన్నిక అంశంపై నాటకీయ పరిణామాలు జరిగాయి. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేయగా… అందుకు అంగీకరించిన ఖడ్గే… సాంప్రదాయం ప్రకారం ఉపసభాపతి పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని కోరారు. ఆ విషయమై ఏకాభిప్రాయం కోసం పార్లమెంట్లోని సింగ్ కార్యాలయంలో ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత టీఆర్ బాలు, రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. అయితే రెండు పక్షాల మధ్య సంక్షిప్త చర్చ వాగ్వాదంతో ముగిసింది. ప్రతిపక్షాలకు ఉప సభాపతి పదవి ఇచ్చేందుకు రాజ్నాథ్ హామీ ఇవ్వకపోవడంతో ఇండియా నేతలు వెనుదిరిగారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్సింగ్లు విపక్షాలను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఖడ్గేని అవమానించారు: రాహుల్
ప్రతిపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా సహకరించాలని ప్రధాని మోదీ పేర్కొంటుండగా, అధికారపక్షం మాత్రం తమ పార్టీ అధ్యక్షుడు ఖడ్గేని అవమానించిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ మండిపడ్డారు. స్పీకర్ ఎన్నిక విషయమై సహకరించాలని తమను కోరినట్లు చెప్పారు. అయితే సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వాలని ఖడ్గ్గే అడిగినట్లు రాహుల్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ అంశంపై అధికారపక్షం తన వైఖరి స్పష్టం చేయకుండానే స్పీకర్ ఎన్నికకు సహకరించాలని కోరటం విడ్డూరంగా ఉందని రాహుల్గాంధీ మండిపడ్డారు.
కాంగ్రెస్ మమ్మల్ని సంప్రదించలేదు: టీఎంసీ
ఇండియా ఐక్య సంఘటన తరపున స్పీకర్ అభ్యర్థిగా కోడికున్నిల్ సురేశ్ను బరిలో నిలిపే విషయమై కాంగ్రెస్ పార్టీ తమను సంప్రదించలేదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. సురేశ్కు మద్దతునిచ్చే విషయమై పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ ఎన్నిక కోసం సురేశ్ నామినేషన్ పత్రాలపై టీఎంసీ సంతకం చేయలేదని తెలిపారు. స్పీకర్ ఎన్నికలో అనుసరించాల్సి వ్యూహంపై మంగళవారం రాత్రి మల్లికార్జున ఖడ్గే నివాసంలో జరిగే సమావేశానికి కూడా హాజరు కావడంలేదని తెలిపారు.
‘ఇండియా’ షరతులు విధించింది: గోయల్
మరోవైపు స్పీకర్ పదవి విషయమై ఇండియా కూటమి షరతులు విధించటం సరికాదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. ఉప సభాపతి ఎన్నిక జరిగేటప్పుడు విపక్షాల డిమాండ్ను పరిశీలించేందుకు అంగీకరించినట్లు ఆయన చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు పార్టీ రహితమన్నారు. ఇండియా కూటమి సంప్రదాయాలను పాటించట్లేదని గోయల్ ఆరోపించారు.
1946 తర్వాత మళ్లీ ఇప్పుడే…
స్వాతంత్య్రానికి పూర్వం 1925 ఆగస్టు 24న అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. తర్వాత అదే పార్లమెంటుగా మారింది. ఆ ఎన్నికల్లో టి రంగాచారియార్పై స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్భాయ్ జె పటేల్ స్పీకర్గా నెగ్గారు. కేవలం రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1925 – 1946 మధ్య ఆరుసార్లు స్పీకర్ పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. చిట్టచివరిగా 1946లో ఎన్నికైన కాంగ్రెస్ నేత జీవీ మౌలాంకర్ ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా స్పీకర్గా కొన్నాళ్లు కొనసాగారు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మౌలంకర్ మరణంతో ఉప సభాపతిగా ఉన్న అయ్యంగార్ స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్గా నియమితులయ్యారు. ఆ విధంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతూ వస్తోంది.