70 శాతం మందికి టీకాలు పూర్తయితే..ఈ ఏడాదిలో కొవిడ్ తీవ్ర దశ ముగుస్తుంది : డబ్ల్యూహెచ్వో
ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయితే కరోనా మహమ్మారి తీవ్రమైన దశ ఈ ఏడాదిలో ముగుస్తుందని డబ్ల్యూహెచ్వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పడుతుండగా..కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదని ఇటీవల డబ్ల్యూహెచ్వో హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టెడ్ర్స్ ఈ విషయమై మాట్లాడుతూ, ‘ఈ ఏడాది జూన్, జూలై మధ్యలో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మందికి టీకాలు పూర్తయితే, సంవత్సరాంతానికి కరోనా వైరస్ తీవ్రమైన దశ ముగుస్తుందని అంచనా. మనం ఆశించేది ఇదే. అంతా మన చేతుల్లోనే ఉంది.’ అని పేర్కొన్నారు. కాగా ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు కేవలం 11 శాతం మందికి మాత్రమే కొవిడ్ టీకా పూర్తయింది. ఇది ప్రపంచంలోనే తక్కువ రేటు కావడం గమనార్హం. స్థానికంగా 70శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుత టీకాల వేగాన్ని ఆరు రెట్లు పెంచాల్సి ఉందని డబ్ల్యూహెచ్వో తెలిపింది.