Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అక్రమ ఏజెన్సీలపై ఉక్కుపాదం

. గనుల కార్యకలాపాల పెంపుపై దృష్టి
. సులభతర పన్ను చెల్లింపు ప్రక్రియ వేగవంతం
. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలను నిరోధించండి
. ఆదాయశాఖల సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆదాయవనరుల శాఖలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కలిగించి, ఆ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని వాణిజ్య పన్నులశాఖ అధికారులకు సూచించారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను చెల్లించే వారికి చక్కటి సేవలు అందించినట్టు అవుతుందన్నారు. వాణిజ్య సలహా కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్‌ శాఖపై సమీక్షించిన సీఎం,…గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గినట్లు చెప్పారు. బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్‌ రూమ్‌లు రద్దు వంటి నియంత్రణ చర్యల వల్ల అమ్మకాలు తగ్గాయని, ధరలు పెంచడం వల్ల మద్యం వినియోగం తగ్గిందని సీఎం వెల్లడిరచారు. అయితే అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్‌ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలని, వాటిని నివారించడానికి తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎస్‌ఈబీలో పరివర్తన కార్యక్రమంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీసిన సీఎం… చేయూత, ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా వారికి ఊతమివ్వాలని సూచించారు. గంజాయి, అక్రమ మద్యం కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏజెన్సీలో గంజాయి నివారణ చర్యలు చేస్తూనే… మరోపక్క ఉపాధి మార్గాలు కల్పించాలన్నారు. వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని, లేకపోతే అర్హులైన వారందరికీ తక్షణమే పట్టాలివ్వాలన్నారు. తద్వారా పట్టాలు వచ్చిన రైతులకు రైతు భరోసా లభిస్తుందని, విత్తనాలు, ఎరువులు అందించాలని, అప్పుడే ఆశించిన స్థాయిలో మార్పు వస్తుందన్నారు. దీనివల్ల అక్రమ మద్యం, గంజాయి సాగు నుంచి రైతులు దూరమవుతారని సీఎం మార్గనిర్దేశనం చేశారు. శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాల్లో…వార్డుల్లో…సబ్‌రిజిస్ట్రార్‌ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించడంతో పాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి చైతన్యం కల్పించాలని సీఎం సూచించారు. గనులశాఖపై సమీక్షిస్తూ నిరుపయోగంగా ఉన్న మైనింగ్‌ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షా సమావేశంలో విద్యుత్‌, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఎక్సైజ్‌ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌, రాష్ట్ర పన్నుల ముఖ్య కమిషనర్‌ గిరిజా శంకర్‌, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img