సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా యువత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా వయో పరిమితి విషయంలో అభ్యంతరాలు వస్తున్నాయి. అర్హత వయసును 17.5 నుంచి 21 ఏళ్లుగా నిర్ణయించడంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో యువత ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నియమాకాలకు సంబంధించి వయో పరిమితిని మరో రెండేళ్లకు పెంచి గరిష్ట వయసు 23గా నిర్ణయించింది. కొవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి సైనిక నియమకాలు చేపట్టకపోవడం, ఆశావాహుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం కొంత సడలింపు ఇచ్చింది. 2022 నియమకాలకు సంబంధించి అర్హతను గరిష్టంగా 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వరుసగా మూడోరోజు నిరసనలు సాగుతున్న వేళ రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ వ్యవస్థలో భాగం కావడానికి, దేశ సేవ చేయడానికి యువతకు ఒక బంగారంలాంటి అవకాశం. గత రెండేళ్లలో నియామకాలు చేపట్టని కారణంగా సైన్యంలో చేరులనుకున్న వారికి అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్ని వీరుల నియామకానికి ఈ ఏడాది వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు. ఈ మినహాయింపు ఒకసారికి మాత్రమే. దీనివల్ల అనేకమందికి అగ్నివీరులుగా మారేందుకు అర్హత లభిస్తుంది. ఈ సందర్భంగా ప్రధానికి యువకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెంటనే యువకులంతా అందుకు సన్నద్ధం కావాలని కోరుతున్నాను.’ అని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.