. పరిశ్రమ స్థాపన నుంచి మార్కెటింగ్ వరకు…
. స్టార్టప్ కాన్సెప్ట్కు ప్రోత్సాహం
. విశాఖలో భారీ భవన నిర్మాణం
. నూతన పారిశ్రామిక విధానంపై సీఎం జగన్
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: అడ్వైజ్, అసిస్ట్ అండ్ సపోర్టివ్గా ఎంఎస్ఎంఈ నూతన పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పరిశ్రామల శాఖ అధికారులతో సీఎం ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలసీ ఎలా ఉండాలనేదానిపై ముఖ్యమంత్రి కీలక సూచనలిచ్చారు. ముఖ్యంగా పరిశ్రమల స్థాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించేలా పాలసీ ఉండాలన్నారు. నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంలో మార్కెటింగ్ టై అప్ విధానంపై దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయంగా మార్కెటింగ్ టైఅప్ చేయగలిగితే ఎంఎస్ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని, సరైన మార్కెటింగ్ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయన్నారు. స్టార్టప్ కాన్సెప్ట్ను ప్రోత్సహించాలన్నారు. ఇందుకోసం విశాఖపట్నం నగరంలో మంచి ప్రాంతంలో సుమారు 3 లక్షల చదరపు అడుగులతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని సీఎం చెప్పారు. అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాలయం కూడా ఉండాలన్నారు. పోర్ట్ ఆధారిత పరిశ్రమల కోసం మౌలిక సదుపాయాల కల్పనదిశగా దృష్టిసారించాలన్నారు. ఈ అంశాల ప్రాతిపదికగా ఇండిస్ట్రియల్ పాలసీలో ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఆర్థికశాఖ కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, గుల్జార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.