Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అదానీకి అప్పగింతలు

. అనంతపురం జిల్లాలో రూ.5 లక్షలకే 406 ఎకరాలు
. ఇక పదో తరగతి పాసైతేనే వైఎస్సార్‌ కళ్యాణమస్తు
. కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం
. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలుకు 1610 పోస్టులు భర్తీ
. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : తీవ్ర ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొద్దిరోజులుగా ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం నుంచి 20వ స్థానానికి చేరుకున్న అదానీ కంపెనీ లావాదేవీలు పార్లమెంటును ఒకపక్క కుదిపేస్తుండగా, ఏపీ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు అనంతపురం జిల్లా పెద్దకోట్ల, దాడితోట గ్రామాల పరిధిలో ఎకరం రూ.5 లక్షల చొప్పున 406.46 ఎకరాలు కేటాయించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. ఆ గ్రామాల్లో 500 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఈ భూమిని కేటాయించనున్నారు. ఒకపక్క అదానీ కంపెనీలన్నింటిపై సీబీఐ దర్యాప్తునకు ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఏమీ జరగనట్లు యధాతథంగా భూములు కేటాయించడం విశేషం. బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 70 అంశాలపై చర్చించిన కేబినెట్‌ ఈ కింది నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు తెలియజేశారు. ఫిబ్రవరి 10న వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వధూవరులు కచ్చితంగా పదోతరగతి పాసవ్వాలన్న నిబంధనను కొత్తగా అమల్లోకి తెచ్చింది. అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ వివాహం చేసుకున్నవాళ్లకు సంబంధించి… జనవరిలో తనిఖీ చేసి ఫిబ్రవరిలో చెల్లించాలని, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో వివాహం చేసుకున్నవాళ్లకు ఏప్రిల్‌ నెలలో తనిఖీ చేసి మే నెలలో ప్రతి మూడు నెలలకొకమారు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం తీసుకున్న మరిన్ని నిర్ణయాలివే.
. ఫిబ్రవరి 17న వైఎస్‌ఆర్‌ లా నేస్తం కింద 65,537 వేల మంది జూనియర్‌ న్యాయవాదులకు నిధులు
. కర్నూలులో 50 ఎకరాల స్థలంలో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం
. ఫిబ్రవరి 24న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు
. ఫిబ్రవరి 28న జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌
. ఉగాది సందర్భంగా మూడో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా
. మార్చిలో ఈబీసీ నేస్తం, వసతి దీవెన
. కర్నూలు జిల్లా డోన్‌లో నూతనంగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 31 మంది బోధన, 12 మంది బోధనేతర సిబ్బంది భర్తీ
. నందిగామలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను రూ.34.48 కోట్ల వ్యయంతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌ గ్రేడ్‌, 52 పోస్టుల భర్తీ
. వైద్య విభాగంలో పోస్టుల భర్తీ కోసం మెడికల్‌ సర్వీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు
. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం పటిష్టంగా అమలుకు ప్రతి పీహెచ్‌సీలో సిబ్బందిని 12 నుంచి 14 మందికి పెంపు, కొత్తగా 1,610 కొత్త పోస్టుల భర్తీ
. వైఎస్సార్‌ జిల్లా ఫాతిమా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో 2015-16 విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌
. 1998 డీఎస్సీలో క్వాలిఫైడ్‌ అభ్యర్థులతో 4,534 సెకండరీ గ్రేడ్‌ టీచర్ల పోస్టుల భర్తీ
. సబ్జెక్టు టీచర్లుగా అర్హత పొందిన 5,809 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు నెలకు రూ.2500 చొప్పున సబ్జెక్ట్‌ టీచర్‌ అలవెన్స్‌
. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల బోధనా సిబ్బందికి గౌరవ వేతనానికి అదనంగా 23 శాతం పెంపు
. విశాఖపట్నంలో 100 మెగావాట్ల డేటా సెంటర్‌, ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్కు, స్కిల్‌ సెంటర్‌తో పాటు రిక్రియేషన్‌ సెంటర్ల ఏర్పాటు కోసం అవసరమైన 60.29 ఎకరాల భూమి వైజాగ్‌ టెక్‌ పార్కు లిమిటెడ్‌ (వీటీపీఎల్‌)కు కేటాయింపు
. ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌లో 29 అదనపు పోస్టులు
. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాల్టీస్‌ యాక్టు`1965, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ యాక్టు 1955 సవరణల డ్రాప్ట్‌ బిల్లుకు ఆమోదం
. నెల్లూరు బ్యారేజ్‌ను నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు బ్యారేజ్‌గా మార్పు
. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రుణ సదుపాయం కోసం రూ.3,940.42 కోట్ల బ్యాంకు గ్యారంటీకి ఆమోదం
. రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్‌ బెర్తుల నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు 250 ఎకరాల భూమి లీజు
. విజయనగరంలో అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటు
. మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగింపు
. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంను రెవెన్యూ డివిజన్‌గా మార్పు, కొత్త పోలీస్‌ సబ్‌డివిజన్‌ ఏర్పాటు
. ఎన్టీఆర్‌ జిల్లాలో వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మార్పు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img