అఫ్ఘానిస్తాన్ విషయంలో భారత్ తక్షణం చేపట్టవలసిన చర్యలను గుర్తించాలని అత్యున్నత స్థాయి అధికారులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. అఫ్ఘ్ఘానిస్తాన్లో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించడానికి ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులు, అప్ఘాన్లు, మైనారిటీలను భారత దేశానికి సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యతలను ఈ బృందానికి అప్పగించారు. ఆఫ్ఘానిస్తాన్్ సంక్షోభం గురించి గత కొద్ది రోజులుగా ప్రతి నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్న వారితో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అఫ్ఘానిస్తాన్లో భారత్ తక్షణ ప్రాధాన్యతలపై దృష్టి సారించనుంది.అఫ్ఘానిస్తాన్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను, అంతర్జాతీయ స్పందనలను కూడా ఈ బృందం పర్యవేక్షిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని కూడా పరిశీలిస్తోంది.