Friday, April 19, 2024
Friday, April 19, 2024

‘అమిత్‌ షాకు హోం శాఖ కంటే క్రీడలే బెటర్‌’..

కేంద్రంపై బీజేపీ సీనియర్‌ నేత స్వామి విమర్శలు
జమ్మూ కశ్మీర్‌లో సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని జరుగుతోన్న వరుస హత్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. అయితే, తాజాగా, మోదీ సర్కారుపై సొంత పార్టీ నేత సుబ్రమణ్య స్వామి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కశ్మీర్‌ ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయనకు హోం శాఖ కంటే క్రీడాశాఖ అయితే బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు అమిత్‌ షా హాజరైన విషయం తెలిసిందే. దీనిని స్వామి పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది.. అక్కడ రోజుకో కశ్మీరీ హిందువు హత్యకు గురవుతున్నారు.. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాజీనామాకు డిమాండ్‌ చేయాల్సిన అవసరం ఏర్పడిరది.. ఆయనకు క్రీడల శాఖ అప్పగిస్తే బాగుంటుంది.. ఎందుకంటే ఈ రోజుల్లో క్రికెట్‌కు అనవసర ఆదరణ బాగా పెరిగింది’’ అంటూ ట్విట్టర్‌ వేదికగా స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గురువారం కుల్గామ్‌లో ఇలాఖీ దేహతీ బ్యాంకు మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ను కాల్చి చంపిన ముష్కరులు.. చందూరులో ఇటుకల బట్టిల్లో పనిచేసే కార్మికులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బీహార్‌కు చెందిన ఓ వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతకు రెండు రోజుల ముందు సాంబ జిల్లాలో కశ్మీరీ పండిట్‌ రజినీ బాలా అనే ఉపాధ్యాయురాలిని పొట్టనబెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా, ఐపీఎల్‌ విషయంలోనూ అమిత్‌ షాను టార్గెట్‌ చేస్తూ స్వామి విమర్శలు గుప్పించారు. ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిన్టు అనుమానం ఉందని అమిత్‌ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘టీ 20 మెగా టోర్నీ ఫలితాల్లో రిగ్గింగ్‌ (మ్యాచ్‌ ఫిక్సింగ్‌) జరిగినట్లు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.. వీటిపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది.. ఈ విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయానుకుంటున్నా.. ఎందుకంటే భారత క్రికెట్‌ బోర్డుకు అమిత్‌ షా కుమారుడు ‘నియంత’గా వ్యవహరిస్తున్నందున ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోదు’’ అని స్వామి తీవ్ర స్థాయిలో విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img