పటమట రిజిస్ట్రార్, దుర్గగుడి సూపరింటెండెంట్, కర్నూలు కో`ఆపరేటివ్ ఏఆర్ ఇళ్లలో సోదాలు
పెద్దఎత్తున నగదు, బంగారం స్వాధీనం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న వారిపై ఏసీబీ నిఘా పెట్టింది. తమకు అందిన సమాచారం మేరకు తనిఖీలు జరుపుతూ అక్రమ సొత్తును స్వాధీనం చేసుకుంటోంది. ఇదే క్రమంలో బుధవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖాధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. ప్రముఖ ఆలయాల్లో పనిచేసే అధికారులతో పాటు, రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు చేపట్టారు. విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం సూపరింటెండెంట్ వాసా నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. విజయవాడ కుమ్మరిపాలెంలోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ ప్లాట్ ఎఫ్34లో నివాసంతోపాటు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని భీమడోలు, ద్వారకా తిరుమల, నిడదవోలులోని ఆరుచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఏవో బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలను అధికారులు చేపట్టారు. కర్నూలు జిల్లాలోని డివిజనల్ కో
ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రేమరపోగు సుజాత, ఎన్టీఆర్ జిల్లా పటమట సబ్ రిజిస్ట్రార్ అర్జ రాఘవరావు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తుల పత్రాలు, నగదు, వాహనాలు, బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ కాల్ సెంటర్ 14400, ఏసీబీ యాప్కు అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు జరిగాయి.