విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వైఎస్ వివేకా హత్య కేసులో కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారం మరోసారి విచారించారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ బృందం అవినాష్ రెడ్డిని విచారించింది. అయితే తనను న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని అవినాష్ కోరారు. విచారణ సమయంలో న్యాయవాదులకు అనుమతి లేదని సీబీఐ స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి బ్యాంక్ లావాదేవీలపై సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. దస్తగిరి స్టేట్మెంట్ను ప్రస్తావిస్తూ అవినాష్ను విచారిస్తున్నారు. రూ.40 కోట్ల డీల్ వ్యవహారంపై, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో ఉన్న కాల్ లిస్ట్, నిందితుల టవర్ లొకేషన్లపై కూడా సీబీఐ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. విచారణ అనంతరం అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని తెలిపారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానని, వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిని టార్గెట్ చేసి విచారణ జరుగుతోందని అవినాష్రెడ్డి అన్నారు. ‘సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా. విచారణపై ఎవరికైనా సందేహాలు వస్తాయి. వివేకా చనిపోయిన రోజున మార్చురీ దగ్గర ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. అదే వాస్తవం. విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రోల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాలుగా వేయండి. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు.