నకిలీ చలానా కుంభకోణం కలకలం
రూ.5.25కోట్ల అక్రమాలు గుర్తింపు
రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు
17 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి
ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లపై వేటు
అమరావతి : రాష్ట్రంలో సబ్రిజిస్ట్రారు కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ చలానా కుంభకోణం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హడావుడిగా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో అవినీతిపై రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ శేషగిరిబాబు స్పందించారు. సాప్ట్వేర్లో లొసుగుల కారణంగానే ఈ తరహా అవినీతి జరిగినట్లు తెలిపారు. దాదాపు 17 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. ఇందులో 10 కార్యాలయాల్లో భారీగా అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోటి రూపాయలు రికవరీ చేసి, అవకతవకలకు పాల్పడిన ఆరుగురు సబ్రిజిస్ట్రార్లపై వేటు వేశారు. మిగతా వారిపైనా గోప్యంగా విచారణ కొనసాగుతోంది. మరికొందరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపైనా కేసులు నమోదు చేశారు. చలానాల గోల్మాల్లో రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. పొన్నూరు, మంగళగిరి, విశాఖ, నంద్యాల, భీమవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీలు నిర్వహించి, వివరాలను సేకరించింది.
కొత్త సాఫ్ట్వేర్ తెస్తాం : శేషగిరిబాబు
సాఫ్ట్వేర్లో ఉన్న లొసుగుల ఆధారంగానే కొందరు అక్రమాలకు పాల్పడినట్లు తాము గుర్తించామని, 25 ఏళ్ల క్రితం విధానాన్ని మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లు పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందన్నారు. నాటి విధానం అమలు తప్పనిసరని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలకు ఆదేశించామన్నారు. గుంటూరుజిల్లా వ్యాప్తంగా 35 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు తనిఖీలు చేయగా, ఒక్క మంగళగిరి కార్యాలయంలోనే అవినీతి జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘటనపై ఏడుగురిపై కేసులు నమోదు చేశామన్నారు. పాత సాఫ్ట్వేర్ స్థానంలో నూతన సాఫ్ట్వేర్ ఈనెల 16వ తేదీ నుంచి వినియోగంలోకి రానుందని చెప్పారు.
నంద్యాల సబ్రిజిస్ట్రార్ సస్పెన్షన్
విశాలాంధ్ర – నంద్యాల సిటీ : నకిలీ చలానా కుంభకోణంలో నంద్యాల సబ్ రిజిస్ట్రార్ సోఫియా బేగం, జూనియర్ అసిస్టెంట్ వీరన్నలను జిల్లా రిజిస్ట్రార్ సస్పెండ్ చేశారు. నకిలీ చలానాలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టినట్లు ఫిర్యాదు రావడంతో రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. ఒక్క కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే 54 నకిలీ చలానాలను అధికారులు గుర్తించారు. దీంతో గురువారం రాత్రి నుంచి ఈ వ్యవహారంపై సబ్ రిజిస్ట్రార్ సోఫియాబేగం, జూనియర్ అసిస్టెంట్ వీరన్నలపై దర్యాప్తు చేసి, తుదకు వేటు వేశారు. 20 రోజుల్లో రిజిస్ట్రార్ సోఫియాబేగం పదవీ విరమణ చేయాల్సి ఉండగా, అంతలోనే ఆమె సస్పెన్షన్కు గురయ్యారు. ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శుక్రవారం బోసిపోయింది. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో జిల్లా రిజిస్ట్రార్ అప్పటికప్పుడు తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేశారు. గతంలో నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసినా అధికారుల్లో మార్పు రాలేదు. డాక్యుమెంట్ రైటర్లు సిండికేట్గా మారి వారు చెప్పిందే వేదంగా కార్యాలయ అధికారులు నడుచుకుంటున్నారనే విమర్శలున్నాయి. రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.5వేల నుంచి ఆపై ఆస్తి విలువను బట్టి లంచం లేనిదే పని సాగడం లేదని సమాచారం.