Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అసంపూర్తి చర్చలు

పోలవరంపై ఆ మూడు గరం గరం

. కేంద్ర జలశక్తి సమావేశంలో వాడివేడీ చర్చ
. ముంపు సమస్యపై తెలంగాణ వాదనలు
. ప్రజాభిప్రాయ సేకరణే జరగలేదన్న ఒడిశా, చత్తీస్‌గఢ్‌
. కేంద్ర డిజైన్ల ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణమన్న పీపీఏ చైర్మన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తలెత్తే పర్యావరణ సమస్యలు, పొరుగు రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం గరం గరంగా సాగి అసంపూర్తిగా ముగిసింది. ఆయా రాష్ట్రాల వాదనలు వాడివేడిగా సాగాయి. ఏపీ లక్ష్యంగా మూడు రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అయితే ఈ విషయంలో ఏపీకి కేంద్రం అండగా నిలిచింది. గోదావరి ట్రిబ్యునల్‌కు కట్టుబడి, కేంద్రం ఆమోదించిన డిజైన్ల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, దానివల్ల ఎవరికీ నష్టం రాదని పీపీఏ చైర్మన్‌ ఆర్కే గుప్తా స్పష్టం చేశారు. ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ…ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను పీపీఏ చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. పొరుగు రాష్ట్రాల వాదనలను ఏపీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందని, దానిపై థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల అంచనాకు మించి తమ రాష్ట్రానికి ముప్పు వాటిల్లుతుందని గణాంకాలతో సహా కేంద్ర జలశక్తి శాఖ ముందు తెలంగాణ అధికారులు వినిపించారు. చారిత్రక ప్రదేశాలు, విద్యుత్‌ కేంద్రం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ముంపు నివారణ చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి శాఖను కోరింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, దీనివల్ల ముంపు సమస్య తీవ్రంగా ఉందని ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు తెలిపాయి. కనీసం ముంపు సమస్యపై ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదని ఆరోపించాయి. దీనిపై ఇప్పటికే రెండుసార్లు అధ్యయనం చేశామని, పోలవరం వల్ల భద్రాచలానికి ఎలాంటి ముంపు ఉండదని కేంద్రం తేల్చిచెప్పింది. అయితే మూడు రాష్ట్రాలు ఒకేమాటగా ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించాల్సిందేనని పట్టుబట్టాయి. ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిశా, చత్తీస్‌గఢ్‌ సహకరించట్లేదని ఏపీ తెలిపింది. మొత్తానికి కేంద్ర జలశక్తి సమావేశం అసంపూర్తిగా ముగియగా, అక్టోబర్‌ 7న మరోసారి సమావేశం కావాలని కేంద్ర జలశక్తి నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఒడిశాలో ముంపు సమస్య లేకుండా ఉండేందుకు కరకట్ట నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒడిశాతో కలిసి ఉమ్మడి సర్వే నిర్వహించి ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై ఎన్నిసార్లు లేఖలు రాసినా ఒడిశా నుంచి స్పందన లేదు. అందుచేత ఆ రాష్ట్రంలోని ముంపు ప్రాంతాల సమస్యపై కేంద్రమే చొరవ తీసుకుని ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఒప్పించాల్సి ఉంది. ఇప్పటి వరకూ ముంపు సమస్య ఒడిశా నుంచే ఎదురువుతుండగా.. తాజాగా తెలంగాణ నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. పోలవరం నిర్మాణంతో భద్రాచలం మునిగిపోతుందని అంటోంది. జాతీయ హోదా కలిగిన ఈ ప్రాజెక్టుకయ్యే వ్యయమంతంటినీ కేంద్రమే భరించాల్సి ఉంది. కాంక్రీట్‌ నిర్మాణ పనులు సహా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల వ్యయం బాధ్యతా కేంద్రానిదే. కానీ భూసేకరణ విషయంలో రాష్ట్రాన్ని తప్పుబడుతూ వస్తోంది. భూసేకరణలో జాప్యం కారణంగా వ్యయాలు విపరీతంగా పెరిగాయని, సహాయ పునరావాస చెల్లింపుల బాధ్యత తనది కాదని, 2013 భూసేకరణ చట్టం మేరకు చెల్లింపులు జరపాలంటే కష్టమని ఏపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశించగా, అసంపూర్తిగానే ముగియడం రాష్ట్ర ప్రజలను నిరాశపర్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img