ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి బ్రిడ్జ్ కూలిపోయింది. పంజాబ్`హిమాచల్ప్రదేశ్లను కలుపుతూ చక్కీ నదిపై నిర్మించిన ఈ వంతెనకు చెందిన ఓ పిల్లరు భారీ వరద కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగ లేదు. పఠాన్కోట్, జోగిందర్నగర్ మధ్య 1928లో మొదటిసారిగా బ్రిటీష్ వారు ప్రారంభించిన రైలు సర్వీసులు వంతెనపై పగుళ్లు కనిపించడంతో గత నెలలోనే నిలిపివేశారు. కూలిపోయిన బ్రిడ్జికి సంబంధించి దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. కాంగ్రా, చంబా, బిలాస్పూర్, సిర్మౌర్, మండి జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో మండి జిల్లాలో పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా మండి జిల్లాలో ఇళ్లు, దుకాణాలలోకి నీళ్లు చేరాయి. అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. ఆగస్టు 25 వరకు హిమాచల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ హెచ్చరికలు జారీ చేసింది.