Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఆటోను ఢీకొన్న టిప్పర్‌ నలుగురి దుర్మరణం

మృతుల్లో ఇద్దరు చిన్నారులు
మరో ఇద్దరి పరిస్థితి విషమం
కడప`రేణిగుంట జాతీయ రహదారిపై ప్రమాదం

విశాలాంధ్ర రైల్వేకోడూరు: కడప జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలవగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రైల్వేకోడూరు మండల పరిధిలోని కడపరేణిగుంట 716 నంబరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… రైల్వే కోడూరు నుంచి ఆటోలో ఆరుగురు చిన్నవరంపాడు గ్రామ పంచాయితీలోని అయ్యల రాజుపల్లి దళితవాడకు వెళుతున్న సమయంలో అనంతరాజుపేట గ్రామ పంచాయితీ పరిధిలో సాయంత్రం 5.30 గంటలకు ఏపీ39టి6546 నంబరు గల ఆటోను ఎదురుగా వస్తున్న ఏపీ04 టీఎక్స్‌ 2132 నంబరు గల టిప్పర్‌ లారీ ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న సుబ్బమ్మ, తొలిసమ్మ, ఆరు నెలల పసికందు, 10 సంవత్సరాల బాలిక అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్‌ బాలకృష్ణ, పెంచలమ్మ ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో పెంచలమ్మ పిల్లలు ఇద్దరూ మృత్యువాత పడటం చూపరులను కలచివేసింది. కోడూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద బాధితుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అయ్యలరాజుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాద సంఘటన తెలుసుకున్న రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌ రెడ్డి, సీఐ ఎస్‌.విశ్వనాథరెడ్డి, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.జి.హేమాద్రి, ఇ.వి.వి.నరసింహం హుటాహుటిన ప్రమాద స్థలానికి వెళ్లి కొన ఊపిరితో ఉన్న వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ వైద్య శాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా క్రమబద్ధీకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img