ప్రాథమిక నష్టం అంచనా రూ.6,054 కోట్లు
తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లివ్వండి
నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపండి
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షాకు సీఎం జగన్ లేఖ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: అసాధారణ వర్షపాతం కారణంగా ఏపీలోని నాలుగు జిల్లాలు భారీగా నష్టపోయాయని, కేంద్రప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన బుధవారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు వేర్వేరుగా లేఖలు రాశారు. నష్టం అంచనాకు వెంటనే కేంద్ర బృందాలను పంపాలని, ఈలోగా తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని కోరారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో 255శాతం మేర అసాధారణ వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని సీఎం లేఖలో వివరించారు. తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేట తదితర అనేక పట్టణాలు, కొన్ని ప్రాంతాలు భారీ వర్షాలకు పూర్తిగా నీటమునిగాయి. అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అన్నమయ్య, ఫించా ప్రాజెక్టులకు గండ్లు పడ్డాయి. అనేక చోట్ల రోడ్లకు గండ్లుపడి రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. దాదాపు 196 మండలాలకు భారీ నష్టం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆ నాలుగు జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. చెరువులకు గండ్లు పడటంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరి, పత్తి, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, చెరకు, పచ్చిశెనగ పంటలు దాదాపు లక్షా 43వేల హెక్టార్ల పంట నష్టపోయింది. ఇవిగాక అరటి, బొప్పాయి, పసుపు, ఉల్లి, కూరగాయలు వంటి పంటలు 42,299 హెక్టార్లలో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా 1887 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. వీటితోపాటు డ్రైనేజీలు, పైపులైన్స్ మున్సిపల్ స్కూల్సు భవనాలు అనేక ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. గ్రామాల పరిధిలోని పంచాయతీ రహదారులు కూడా దాదాపు 2,254 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి.
విద్యుత్ స్తంభాలు నేలకూలి, అనేక సబ్స్టేషన్లు వరదలకు దెబ్బతిని, ఆ రంగానికి భారీ నష్టం వాటిల్లింది. ఇలా అన్ని రంగాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. సుమారు రూ.6,054.29 కోట్లు వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఈ నేపథ్యంలో తక్షణమే కేంద్ర బృందాలను పంపి నష్ట అంచనాలను వేయడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణ వరదసాయం కింద వెయ్యి కోట్లు మంజూరు చేసి ఆదుకోవాలని సీఎం కోరారు.