ప్రధాని నరేంద్ర మోదీ
ఆర్బీఐ కొత్త పథకాలు ప్రారంభం
న్యూదిల్లీ : వినియోగదారుల కేంద్రీకృతంగా రిజర్వు బ్యాంకు తీసుకొచ్చిన రెండు వినూత్న పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారు. ఇవి ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్.. వీటి వల్ల దేశంలో పెట్టుబడుల పరిధి మరింత విస్తరిస్తుందని ప్రధాని ధీమా వెలిబుచ్చారు. మూలధన మార్కెట్ను వినియోగదారులు మరింత సులభంగా యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ అవసరమన్న ప్రధాని, గత ఏడేళ్లలో ప్రభుత్వం ఆర్థిక, బ్యాకింగ్ రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులను పారదర్శకంగా గుర్తించినట్లు చెప్పారు.
‘ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్తో దేశంలోని చిన్న పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన మాధ్యమాన్ని పొందారు. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీలలో చిన్న పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి కచ్చితమైన లాభాలు పొందవచ్చు. దేశ నిర్మాణానికి ఈ నిధులు సాయం చేస్తాయి. రిజర్వుబ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ పథకంతో బ్యాకింగ్ రంగంలో ‘ఒకే దేశం, ఒకే అంబుడ్స్మన్’ సారమైందని మోదీ పేర్కొన్నారు.
కొత్త పథకాల వివరాలు…
ఆర్బీఐ రిటైల్ డెరెక్ట్ స్కీమ్తో దేశంలోని చిన్న పెట్టుబడిదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీలలో నేరుగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఆర్బీఐతో ప్రభుత్వ సెక్యూరీటీల ఖాతాను సులభంగా, ఉచితంగా తెరవవచ్చు. దీని నిర్వహణ కూడా సులభంగానే ఉంటుంది. ఈ ఖాతా ద్వారా వినియోగదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి రుణాలు, పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంతో ఈ తరహా సదుపాయం అందిస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఇక ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ పథకంతో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం మరింత సులభతరం కానుంది. నూతన యంత్రాంగంతో ఆర్బీఐ నియంత్రణలోని సంస్థల ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించవచ్చు. ఫిర్యాదు సమర్పించేందుకు, దాని స్టేటస్ను ట్రాక్ చేసేందుకు, ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు ఆర్బీఐ సింగిల్ రిఫరెన్స్ పాయింట్ను ఏర్పాటు చేస్తుంది. అంబుడ్స్మన్ పథకం కిందకు రాని ఫిర్యాదులను కస్టమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ సెల్స్(సీఈపీసీ) యథావిధిగా పరిష్కరిస్తాయి. దేశవ్యాప్తంగా 30 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి.