మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం జరిగి నలుగురు పసిపిల్లలు సజీవదహనమయ్యారు. స్థానికంగా ఉన్న కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఈ అగ్నిప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 9 గంటలకు ఆసుపత్రిలోని మూడో అంతస్థులో మంటలు చెలరేగడంతో చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకొని పరుగులు తీశారు. ఈ ప్రమాద సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. 36 మంది చిన్నారులు ప్రాణాలతో సురక్షితంగా బయటడినట్లు పోలీసులు తెలిపారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి విశ్వాస్ సారంగ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది..ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారం అందజేస్తామని తెలిపింది. అలాగే ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని మధ్యప్రదేశ్ సీఎం ఆదేశించారు.