ప్రధాని మోదీకి సీఎం జగన్ వినతి
ప్రైవేటులో జూన్లో 17 లక్షలు ఇస్తే 4 లక్షలే వినియోగించారు
ఇచ్చిన డోసుల కంటే మేము ఎక్కువ మందికి చేశామని వెల్లడి
ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయిస్తున్న వాక్సిన్లు వారు పూర్తిస్థాయిలో వినియోగించలేకపోతున్నందున వారి వద్ద మిగిలిన ఆ కోటాను కూడా మాకే ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ పరిస్థితి, వాక్సినేషన్ అంశాలపై, కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ జులై నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వాక్సిన్లను కేటాయించారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే 4,20,209 మందికి మాత్రమే వాక్సిన్ వేయగలిగారు. అంటే వారికి కేటాయించిన వాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. అందువల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా నిల్వ ఉన్న కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. రాష్ట్రం మరింత వేగంగా వాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుందన్నారు. కొవిడ్ నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతామని అన్నారు. అలాగే కొవిడ్ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొంటున్నామని అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవు. దీనివల్ల అత్యాధునిక వైద్య సౌకర్యాలు మాకు లేవు. అయినా సరే కొవిడ్ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచామని సీఎం వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పని చేశాయని తెలిపారు. ఇప్పటివరకు 12 సార్లు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేశాం. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఫోకస్గా టెస్టులు చేశాం. దీనివల్ల కొవిడ్ విస్తరణను అడ్డుకోగలిగాం. వాక్సినేషన్ అనేది కొవిడ్కు సరైన పరిష్కారమని భావిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 1,68,46,210 వాక్సిన్ డోసులు రాగా, వాక్సినేషన్లో అవలంభించిన మెరుగైన పద్ధతుల వల్ల 1,76,70,642 మందికి వాక్సిన్లు ఇవ్వగలిగామన్నారు. జులైలో 53,14,740 వాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని, ఈ కోటాను మరింత పెంచాలన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.