: ప్రియాంక గాంధీ
లఖింపూర్ ఖేరీలో రైతుల మీదకు దూసుకెళ్లిన వాహనం.. వీడియో ట్విట్టర్లో పోస్ట్
తనను నిర్బంధించి 28 గంటలు అవుతోందని, కానీ అన్నదాతల మీద నుంచి కారును తీసుకెళ్లిన వ్యక్తిని మాత్రం ఇంకా అరెస్టు చేయలేదని ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. లఖింపూర్ఖేర్ గ్రామానికి వెళుతున్న ప్రియాంక గాంధీని సోమవారం పోలీసులు అడ్డుకుని, సీతాపూర్లోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలించిన సంగతి తెలిసిందే. ఎటువంటి ఆదేశం లేకుండా ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తున్నారు.. కానీ భయంకర నేరానికి పాల్పడిన కేంద్ర మంత్రి కుమారుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ప్రియాంక ప్రశ్నించారు. వెంటనే అలాంటి నిందితులను అరెస్ట్ చేయాలని.. తమలాంటివారిని కాదంటూ హితవు పలికారు. అజాదీ అమృత్ మహోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ లక్నోకు రానున్న నేపథ్యంలో మీరు లఖింపూర్ ఖేర్ వెళ్తారా.. అంటూ ప్రియాంక ఇలా ప్రశ్నించారు. స్వేచ్ఛ వేడుకలను జరుపుకునేందుకు ప్రధాని మోడీ వస్తున్నారని.. కాని మనకు స్వేచ్ఛను ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. మంత్రి కుమారుడిని అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడం మంత్రిని తొలగించకుండా లక్నోలో స్వేచ్ఛ వేడుకలను జరుపుకునేందుకు మీకు ఎలాంటి నైతిక అధికారం ఉందని అడిగారు. ఈ మంత్రి కొనసాగితే.. కేంద్రంలో ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక అధికారం లేదని మండిపడ్డారు.అదే వీడియోలో ప్రియాంక ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఇవి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా జరిగిన హింస తాలూకు దృశ్యాలంటూ ఆమె పేర్కొంటున్నారు. అందులో కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరిలో రైతులు ధర్నా చేస్తున్న సమయంలో.. వారి వెనుక నుంచి ఓ వాహనం వచ్చి ఢీకొట్టింది. ఆ వాహనం వెనుక మరో వాహనం సైరెన్లతో వెళ్లింది.25 సెకన్ల ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.