బిల్కిస్ బానో రేప్ కేసు నిందితుల్ని ఆగస్టు 15వ తేదీన గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేసిన అంశం తెలిసిందే. 11 మంది నిందితులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. రేప్ నిందితుల్ని ఎలా రిలీజ్ చేస్తారని విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 11 మంది నిందితుల రిలీజ్ అంశాన్ని విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడిరచింది.నిందితుల రిలీజ్ను రద్దు చేయాలని కోరుతూ మహిళా హక్కుల కార్యకర్తలు సుభాషిని అలీ, రేవతి లౌల్, రూపా రేఖా వర్మలు సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనున్నది. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్, అడ్వకేట్ అపర్ణా భట్లు ఈ కేసు తరపున వాదించనున్నారు. బిల్కిస్ బానో రేప్ కేసు 2002లో నమోదు అయ్యింది. గోద్రా అల్లర్ల సమయంలో ఈ ఘటన జరిగింది. బిల్కిస్ బానోను రేప్ చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడు మందిని మర్డర్ చేశారు. అయితే 2008లో ముంబైలోని సీబీఐ కోర్టు 11 మంది నిందితులకు జీవితఖైదు శిక్షను ఖరారు చేసింది. జైలు నుంచి రిలీజైన వారిలో జశ్వంత్ భాయ్ నాహి, గోవింద భాయ్ నాహి, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్భాయ్ వోహనియా, ప్రదీప్ మోర్దియా, బకాభాయ్ వోహనియా, రాజుభాయ్ సోని, మితేష్ భట్, రమేశ్ చందన్ ఉన్నారు.