దేశంలో అనేక ఎలక్ట్రానిక్ కంపెనీల ఫోన్లు, ట్యాబ్లు, ఇతర గాడ్జెట్లు వినియోగంలో ఉన్నాయి. వీటికి విద్యుత్ ఛార్జింగ్ తప్పనిసరి. అయితే, ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా ఛార్జర్ లను రూపొందించడం తెలిసిందే. పైగా, స్మార్ట్ ఫోన్లకు, ట్యాబ్ లకు, పవర్ బ్యాంకులకు, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లకు ఛార్జర్లు భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు, ఇతర పరికరాలన్నింటికి ఒకే ఛార్జర్ తీసుకురానుంది. దీనిపై చర్చించేందుకు కేంద్రం ఈ నెల 17న సమావేశం ఏర్పాటు చేసినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడిరచారు. ఒక్కో డివైస్కు ఒక్కో ఛార్జర్ ఉండడం, తద్వారా దేశంలో ఈ-వేస్ట్ పెరిగిపోవడం వంటి సమస్యలకు స్వస్తి పలికేందుకు కేంద్రం ఏక ఛార్జర్ విధానాన్ని తీసుకురానుంది. ఇటీవలే యూరోపియన్ యూనియన్ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 2024 నుంచి చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలకు కామన్ ఛార్జింగ్ (యూఎస్ బీ టైప్ సీ-పోర్ట్) ప్రమాణాలు అమలు చేయాలని సంకల్పించింది. అమెరికాలోనూ ఇలాంటి ప్రతిపాదనలే వినిపిస్తున్నాయి.