మొన్న విజయ.. నిన్న అముల్
ఇప్పుడు మదర్, గోకుల్ డెయిరీ
న్యూదిల్లీ :
ఇప్పటికే పెట్రోలు, డీజిలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతుంటే… తాజాగా డెయిరీలు పాల ధరలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన విజయ డెయిరీ ఇప్పటికే ధరను పెంచగా, గుజరాత్కు చెందిన అముల్ డెయిరీ ఈ నెల 1వ తేదీ నుంచి పెంచింది. తాజాగా మదర్ డెయిరీ, గోకుల్ డెయిరీ ఆదివారం నుంచి పాల ధరను లీటరుకు రెండు రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. దిల్లీఎన్సీఆర్, ఇతర నగరాల్లో పాల ధర లీటరుపై రెండు రూపాయలు పెంచుతున్నట్లు మదర్ డెయిరీ శనివారం ప్రకటింది. పాల ధరలపై 2019 డిసెంబరులో చివరిగా సమీక్ష జరిగింది. పాల ధర పెంపును మదర్ డెయిరీ సమర్ధించుకుంది. గడచిన ఏడాది కాలంగా రైతుల నుంచి పాల సేకరణ వ్యయం 8
10శాతం పెరిగిందని డెయిరీ తెలిపింది. ఇతర కార్యకలాపాల ఖర్చులు కూడా పెరిగినట్లు వెల్లడిరచింది. జులై ఒకటి నుంచి అన్ని నగరాల్లో అమూల్ కూడా లీటరు పాలపై రెండు రూపాయలు పెంచింది. దిల్లీ ఎన్సీఆర్లో లీటరు పాలపై రెండు రూపాయలు పెంచుతున్నామని, జులై 11 నుంచి ఇది అమలులోకి వస్తుందని మదర్ డెయిరీ ప్రకటించింది. తూర్పు, మధ్య ఉత్తరప్రదేశ్, ముంబై, నాగపూర్, కోల్కతా సహా కీలక మార్కెట్లలో పాల ధరపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో మదర్ డెయిరీ పాలు అందుబాటులో ఉన్నాయి. దిల్లీ`ఎన్సీఆర్లో రోజుకు 30 లక్షల లీటర్ల పాలను మదర్ డెయిరీ విక్రయిస్తోంది. మొత్తం రోజుకు 35 లక్షల లీటర్ల పాలు అమ్ముతోంది. గడచిన ఏడాది కాలంలో పాల సేకరణ, ఇతర మార్గాల ద్వారా ధరలు బాగా పెరిగాయని, కంపెనీపై ఆర్థిక ఒత్తిడి పెరిగిందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పాల ధర పెంచాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. కరోనా కారణంగా ఏడాదికి పైగా పాల వ్యాపారం నష్టాల్లో కూరుకుపోయిందని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
గోకుల్ పాల ధర రెండు రూపాయల పెంపు
మహారాష్ట్రలో గోకుల్ బ్రాండ్ పాల ధర రెండు రూపాయలకు పెరిగింది. ఈ విషయాన్ని కొల్లాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తదారుల సంఘం శనివారం ప్రకటించింది. కొల్లాపూర్, సంగ్లీ, కొంకణ్ మినహా మహారాష్ట్ర మొత్తం ఆదివారం నుంచి పాల ధరను లీటరుకు రెండు రూపాయలు పెంచాలని నిర్ణయించినట్లు ఆ సంఘం తెలిపింది. ఈ సహకార సంఘం గోకుల్ బ్రాండ్ పేరుతో పాల వ్యాపారం చేస్తోంది.
ప్రస్తుతం గోకుల్ ఆవు పాల ధర లీటరుకు రూ.47 ఉంది. రెండు రూపాయల పెంపుతో ఆదివారం నుంచి ఇది రూ.49కి చేరుతుంది. గోకుల్ గేదెపాల ధర లీటరుకు రూ.58 ఉండగా ఇప్పుడది రూ.60కి చేరుతుంది. పాల సేకరణ వ్యయం పెరగడంతో ధర పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సంఘం అధ్యక్షుడు సతేజ్ పాటిల్ తెలిపారు.