కొత్త సాగుచట్టాల రద్దు నిర్ణయంపై రాహుల్, ప్రతిపక్ష నేతల స్పందన
కొత్త సాగుచట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ నేడు సంచలన ప్రకటన చేశారు. దీంతో కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు హర్హం వ్యక్తంచేశాయి. ఇది అన్నదాతల విజయమంటూ రైతులకు శుభాకాంక్షలు తెలిపాయి. ప్రధాని మోదీ ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశ రైతులు తమ సత్యాగ్రహ దీక్షతో.. కేంద్ర సర్కార్ అహంకారాన్ని తలదించుకునేలా చేశారని పేర్కొన్నారు. ఇది అన్యాయంపై విజయమని, ఈ సందర్భరంగా రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. జై హింద్, జై కిసాన్ అంటూ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ంౖతు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన పాత వీడియోను కూడా తన ట్విట్టర్లో రాహుల్ షేర్ చేశారు. రైతు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చేస్తామని, తన మాటాలను గుర్తుపెట్టుకోవాలంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్లో జత చేర్చారు.
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ, ఈ ప్రకాశ్దివాస్ నాడు మంచి వార్త విన్నాం. మూడు సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలకు ప్రతిఫలం దక్కిందన్నారు. అన్నదాతలు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరును భవిష్యత్తు తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయని పేర్కొన్నారు.
కేంద్రం నిర్ణయంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పందించారు. ‘క్రూరత్వానికి చలించకుండా అలుపెరుగని పోరాటం చేసిన ప్రతి ఒక్క రైతులకు హృదయపూర్వక అభినందనలు. ఇది మీ విజయం.ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.’ అని పేర్కొన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో.. రైతుల త్యాగాలు ఫలించాయని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో ముందడుగు వేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై విజయం సాధించిన రైతులను అభినందించారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందిస్తూ, ఇది మంచి వార్త.ఈ పవిత్ర గురునానక్ జయంతి రోజున పంజాబీల డిమాండ్లను అంగీకరించి కొత్త సాగు చట్టాలను రద్దుచేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు అని అన్నారు.