అనన్యను మందలించిన ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే
బాలీవుడ్ను కుదిపేస్తున్న క్రూయిజ్ నౌకపై డ్రగ్స్ కేసు వ్యవహారంలో నటి అనన్య పాండే శుక్రవారం కూడా ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. అయితే అధికారులు చెప్పిన సమయానికి కాకుండా మూడు గంటలు ఆలస్యంగా అనన్య విచారణకు హాజరయ్యారు. దీంతో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే గట్టిగానే మందలించినట్లు సమాచారం. ఆర్యన్ ఖాన్తో డ్రగ్స్ ఛాట్ చేసారన్న కారణంతో బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండేను ఎన్సీబీ అధికారులు గురువారం విచారించిన సంగతి తెలిసిందే. ఎన్సీబీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు అనన్య ముక్తసరిగా సమాధానాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. గురువారం రెండు గంటల పాటు అనన్యను ఎన్సీబీ అధికారులు విచారించారు. అనంతరం మళ్లీ శుక్రవారం ఉదయం 11 గంటలకు రావాల్సిందిగా ఆదేశించారు. అయితే చెప్పిన సమయానికి కాకుండా మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం రెండు గంటలకు అనన్య విచారణకు హాజరయ్యారు. దీంతో సమీర్ వాంఖడే ఆమెపై కోప్పడినట్లు ఏజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఇదేం సినిమా షూటింగ్..ప్రోడక్షన్ హౌజ్ కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయం చెప్పిన సమయానికి కచ్చితంగా రావాల్సిందే.. ఇకపై ఆలస్యం చేయవద్దు అని హెచ్చరించినట్లు తెలిపాయి.శుక్రవారం దాదాపు 4 గంటల పాటు అనన్యను ప్రశ్నించారు. మళ్లీ సోమవారం ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.