బీజేపీపై మాయావతి విమర్శలు
అసెంబ్లీ ఎన్నికల ముందు అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం ద్వారా బీజేపీకి ఓట్లు రాలవని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్వాది పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీ సోమవారం యూపీలోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ను ప్రారంభించిన మరుసటిరోజునే ఆమె ఈ విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్లో మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటికప్పుడే ప్రకటనలు చేస్తున్నాయి, నూతన ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేస్తున్నాయి, పూర్తికాకపోయినా అసంపూర్ణ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. కానీ ఇవేవీ ఆ పార్టీ (బీజేపీ) ఓటు బ్యాంకును పెంచవు అని మాయావతి వ్యాఖ్యానించారు. అదేవిధంగా సమాజ్వాది పార్టీ (ఎస్పీ)పై కూడా ఆమె విమర్శలు చేశారు. ఇతర పార్టీల నుంచి తొలగించిన వాళ్లను, ప్రజల్లో పట్టులేని వాళ్లను, స్వార్థపరులను చేర్చుకోవడంవల్ల ఏ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరదని ఎస్పీని ఉద్దేశించి అన్నారు.