: రాహుల్గాంధీ
ఈడీ విచారణ చాలా చిన్న విషయమని, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, అగ్నిపథ్ పెద్ద సమస్యలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాహుల్గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఐదో రోజు విచారణ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈడీ లాంటి ఏజెన్సీలు తనపై ఒత్తిడి తేలేవని, బెదిరింపులకు గురి చేయలేరని తనను విచారిస్తున్న అధికారులు సైతం అర్థం చేసుకున్నారని అన్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశ సైన్యాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందని అన్నారు. తన కేసు చిన్న విషయమన్న ఆయన.. నేడు ప్రధాన విషయం ఉపాధి అని.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశానికి వెన్నుముక అన్నారు. నరేంద్ర మోదీ ఈ వెన్నుముకను విరిచారని అన్నారు. తమను తాము జాతీయవాదులమని చెప్పుకుంటూ సైన్యాన్ని బలహీనపరిచే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. దేశాన్ని బలోపేతం చేయడానికి నిజమైన దేశభక్తి అవసరమని భారతదేశ యువతకు తెలుసునన్నారు. ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీలో రిక్రూట్మెంట్ కోసం యువత రోజూ పరుగులు తీస్తున్నారన్నారు. ప్రధాని దేశ వెన్నెముకను విరగ్గొట్టారని, ఈ దేశ యువతకు ఉపాధి కల్పించడం లేదని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. బీజేపీ వన్ ర్యాంక్, వన్ పెన్షన్ అని మాట్లాడేదని, ఇప్పుడు ర్యాంక్, పెన్షన్ లేకుండా పోయిందని ఎద్దేశా చేశారు.