ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల వివరాలను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీం ధర్మాసనానికి వివరించారు. ఇప్పటి వరకు 17 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా దేశానికి చేర్చినట్లు తెలిపారు. ఉక్రెయిన్లో ఉన్న మిగతా వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అటార్నీ జనరల్ ధర్మాసనానికి వివరించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గత చేతు అనుభవాల నుంచి పాఠాలు నేర్వకుండా ఇంకా యుద్ధాలకు దిగడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ విషయంలో ఇంతకు మించి చెప్పగలిగింది ఏమీ లేదని.. అయితే విద్యార్థుల క్షేమం తమను ఆందోళనకు గురిచేస్తున్నట్లు పేర్కొంది.ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరినీ దేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని అటార్నీ జనరల్ను సుప్రీంకోర్టు కోరింది. అవసరమైతే విద్యార్థుల తల్లిదండ్రుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించింది.ఉక్రెయిన్లో చిక్కుకపోయిన భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ చేపడుతుండటం తెలిసిందే. ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్కు వారిని తరలిస్తోంది. నేపాల్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ దేశ పౌరులను కూడా తరలించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. కాగా రష్యా వైమానిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉండటంతో అంతా బంకర్లలో తల దాచుకోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సూచించింది. ఇప్పటికే ఒడెస్సా, బిలాసెర్క్వా, వొలిన్ఒబ్లాస్ట్ ప్రాంతాల్లో రష్యా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.