రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో కమిటీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమించారు.ఉక్రెయిన్ సంక్షోభంపై సోమవారం ఏర్పాటు చేసిన అత్యున్నత సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ఆ నలుగురు వెళ్లి, భారతీయుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించనున్నారు. హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు, వీకే సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, ఎన్ఎస్ఎ అజిత్ దోవల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు.ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఇండిగో కూడా ఆపరేషన్ గంగాలో చేరనుంది. సమీక్షా సమావేశంలో భారతీయ విద్యార్థుల భద్రత, తరలింపునకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ ఆదేశించారు.ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశంలో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. ఉక్రెయిన్లో దాదాపు 16,000 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం కువైట్ పై ఇరాక్ దాడికి పాల్పడిన సమయంలో కువైట్ లో చిక్కుకున్న 1.70 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అటువంటి భారీ ఆపరేషన్ కు ఉపక్రమిస్తోంది. ఉక్రెయిన్లో సుమారు 20 వేల మంది భారతీయులు ఉండగా, వారిలో ఇప్పటికే 4 వేల మంది భారత్కు తిరిగి వచ్చారు. మిగిలిన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొదట రోడ్డు మార్గంలో ఉక్రెయిన్ పొరుగు దేశాలయిన హంగేరి, పోలాండ్, స్లొవేకియా, రొమానియాలకు భారతీయులను తరలిస్తోంది.