కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్ పథకాన్ని మరో 4 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేఏవై) గడువును కొనసాగించడానికి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్నికేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియాకు తెలిపారు. కాగా, ఇటీవల పరిస్థితులు తిరిగి మెరుగుపడటంతో నవంబర్ 30వ తేదీ నుంచి ఉచిత రేషన్ పంపిణీని నిలిపివేయనున్నట్టు గత నవంబర్ 5న ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో పథకాన్ని పొడిగించాలని ‘రైట్ టు ఫుడ్’ కార్యకర్తలు సహా పలు పార్టీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర క్యాబినెట్ వచ్చే ఏడాది మార్చి వరకూ పథకాన్ని పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 53,344.52 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఈ విడతలో 163 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు విడుదల చేయనుంది కేంద్ర సర్కార్. దీంతో నిరుపేద రేషన్ లబ్ధిదారులోని ప్రతి వ్యక్తి ప్రతి నెలా 5 కేజీల ఆహారధాన్యాలు ఉచితంగా 2022 మార్చి వరకూ అందుకోనున్నారు.