Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఉద్యోగ సంఘంపై జగన్‌ సర్కార్‌ కక్ష సాధింపు

గవర్నర్‌ను కలవడంపై నోటీసులు జారీ
ఫిర్యాదు చేయలేదు… సమస్యలు చెప్పాం
కొన్ని ఉద్యోగ సంఘాలు సంతోషపడుతున్నాయి
భవిష్యత్‌లో వారికి కూడా ఇదే పరిస్థితి వస్తుందేమో: సూర్యనారాయణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఉద్యోగుల జీతాలపై ప్రశ్నించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై జగన్‌ సర్కార్‌ కక్ష సాధింపులకు దిగింది. సకాలంలో జీతాలు, పెన్షన్‌లు చెల్లించడం లేదని, ఉద్యోగుల పెండిరగ్‌ బకాయిలు ఇవ్వడం లేదని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఉద్యోగ సంఘ నేతలు ఫిర్యాదు చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరుగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే ఆర్‌ సూర్యనారాయణకు సాధారణ పరిపాలన శాఖ (హెచ్‌ఆర్‌) నుంచి నోటీసులు జారీ చేశారు. వేతనాలు, ఆర్థిక అంశాలు వంటి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని సంప్రదించే అనేక వేదికలు ఉండగా, గవర్నర్‌ వద్దకు ఎందుకు వెళ్లారంటూ నోటీసులిచ్చారు. క్రమశిక్షణా ఉల్లంఘన కింద ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని, దీనిపై పేర్కొంటూ, వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసు జారీ చేశారు. ఈనెల 19న జగన్‌ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి భాస్కరరావులతోపాటు మొత్తం ఆరుగురు నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేక పోతోందంటూ ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని, లేకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, 15వ తేదీ వరకు జీతాలు పడుతూనే ఉంటాయని, పెన్షన్ల పరిస్థితి అలాగే ఉందని తెలియజేశారు. జీతాలు 1వ తేదీ తప్పనిసరిగా ఇచ్చేలా చట్టం తీసుకురావాల్సిన అవసరాన్ని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవహారశైలిని, ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఇవన్నీ పత్రికల్లో, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేస్తున్నట్లు నోటీసులో ప్రభుత్వం పేర్కొంది.
ఏ చర్యలు తీసుకున్న సిద్ధమే: సూర్యనారాయణ
ప్రభుత్వ నోటీసుపై స్పందించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వమన్నారని, అన్ని విషయాలతో వివరణ ఇస్తామన్నారు. ప్రభుత్వం
ఏ చర్యలు తీసుకున్న తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఒక సంఘానికే పరిమితమవుతాయా? అని ప్రశ్నించారు. నోటీసుల్లో ఆర్థికపరమైన చెల్లింపులపై షెడ్యూల్‌ ఇస్తే బాగుండేదన్నారు. గవర్నర్‌ కూడా ప్రభుత్వంలో భాగమేనని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ గుర్తింపు రద్దు చేస్తామంటే ఆనందపడుతున్నారన్నారు. భవిష్యత్తులో ఇదే పరిస్థితి వాళ్లకు కూడా ఎదురవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. నిబంధనలకు లోబడే గవర్నర్‌ను కలిశామని చెప్పారు. గవర్నర్‌కు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, తమ సమస్యలను పరిష్కరించమని మాత్రమే చెప్పామన్నారు. మీడియాతో మాట్లాడిన వారు అనేకమంది అనేక సంఘాల్లో ఉన్నారని, వాళ్లకు నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img