కేంద్రంపై హైకోర్టు సీరియస్
తదుపరి విచారణ 17కి వాయిదా
అమరావతి: ఉపాధి హామీ నిధుల చెల్లింపుల్లో నిర్లక్ష్యంపై గతంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఈసారి కేంద్రప్రభుత్వంపై సీరియస్ అయింది. ఉపాధి హామీ పథకం పనులపై ఏపీ హైకోర్టులో మంగళవా రం మరోసారి విచారణ జరిగింది. అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభు త్వంపై కోర్టు సీరియస్ అయింది. కోర్టు ఆదేశించినా సమాచారం ఇవ్వకుండా పాక్షికంగా మెమో ఫైల్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయనందుకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా కార్యదర్శిని ఆదేశించింది. 2014 నుంచి 2019 వరకు నరేగా కింద జరిగిన పనులు, చెల్లింపుల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలా అఫిడవిట్ వేయకపోతే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుందని, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేస్తామని కోర్టు హెచ్చరించింది. ఈనెల 17లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ దశలో కేంద్ర అడిషనల్ సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకుంటూ అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పడంతో తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసింది. గత రెండున్నర సంవత్సరాలుగా ఉపాధి పనులు చేసిన కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇక్కట్లకు లోనవుతున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేసినా ఫలితం లేకపో వడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ నేపధ్య ంలో విచారణ చేపట్టిన హైకోర్టు బిల్లులు నిలిపివేయడాన్ని సీరియస్గా పరిగణించింది. తక్షణమే చెల్లింపులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో కోర్టు ధిక్కారం కింద పరిగణించి సంబంధిత శాఖకు చెందిన ఐఏఎస్ అధికారుల్ని కోర్టుకు కూడా రప్పించింది. అయినా ఇప్పటికీ పూర్తిగా బిల్లుల బకాయి చెల్లింపులు జరగకపోవటం విశేషం. ఇప్పుడు తాజాగా కేంద్రాన్ని కూడా నిలదీయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.