బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం : జేపీ నడ్డా
న్యూదిల్లీ : ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను ఎంపిక చేసినట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక మంది అర్హుల పేర్లను పరిశీలించిన తర్వాత రైతుబిడ్డ ధన్కర్ను ఎంపిక చేశామన్నారు. ఆయన ప్రజల గవర్నర్గా పేరుపొందారని అన్నారు. శనివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నడ్డా తెలిపారు. దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. 2017లో అప్పటి కేబినెట్ మంత్రి, మాజీ ఎంపీ వెంకయ్య నాయుడును ఈ పదవి కోసం బీజేపీ ఎంపిక చేసింది. ఆయన పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. దీంతో అనేక పేర్లను పరిశీలించిన తర్వాత ధన్కర్ను తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ఎంపిక చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుండగా నామినేషన్లకు ఈనెల19 వరకు గడువు ఉంది. పార్లమెంటులో మొత్తం 780 మంది ఎంపీలు ఉంటే బీజేపీకి 394 మంది మద్దతు ఉంది. ఇది మెజారిటీ మార్కు 390 కంటే ఎక్కువ.