తీర్పును వెలువరించనున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
ప్రస్తుతం ఎన్నికల కమిషనర్లను నియమిస్తున్న విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉంది. జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, ఈసీలను కేంద్ర ప్రభుత్వాలు వారి అభిమతం మేరకు, సానుకూలతల మేరకు నియమిస్తున్నాయని పిటిషన్ లో పిటిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్లను నియమించేందుకు స్వతంత్ర కొలీజియంను ఏర్పాటు చేయాలని కోరారు.మరోవైపు జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం..అరుణ్ గోయల్ ను ఎలక్షన్ కమిషనర్ గా నియమించడంపై అటార్నీ జనరల్ ఆర్.వెంటకరమణికి పలు ప్రశ్నలను సంధించింది. అరుణ్ గోయల్ పేరును 24 గంటల్లోనే ఖరారు చేసేందుకు ఏ నిబంధనలను పాటించారని ప్రశ్నించింది. అదే రోజున క్లియరెన్స్ ఎలా ఇచ్చారని, అదే రోజుల పూర్తి వ్యవహారాన్ని ఎలా ముగించారని, 24 గంటల్లోగానే ఆయనను ఎలా అపాయింట్ చేశారని నిలదీసింది. మరోవైపు ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశంలో ఎలాంటి తీర్పును వెలువరించనుందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.